కొత్త బైక్ ఇచ్చి, నష్టపరిహారం చెల్లించాలి…

కొత్త బైక్ ఇచ్చి, నష్టపరిహారం చెల్లించాలి…
కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు…
తయారీలో లోపం ఉన్న “టీవీఎస్ జూపిటర్ 125” వాహనాన్ని తీసుకొని వినియోగదారురాలికి కొత్త వాహనం తిరిగి ఇవ్వాలని లేదా బైకు ఖరీదు 1,15,500రూపాయలు 9% వడ్డీతో తిరిగి చెల్లించాలని, మానసిక ఒత్తిడి కలగజేసినందుకు 25 వేల రూపాయలు లీగల్ ఖర్చులు కింద పదివేల రూపాయలు చెల్లించాలని మచిలీపట్నం టీవీఎస్ డీలర్,విజయవాడ టీవీఎస్ డీలర్, కాసా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఆదేశిస్తూ కృష్ణాజిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు సిహెచ్. కిషోర్ కుమార్ సభ్యురాలు రాయల శ్రీలక్ష్మి బుధవారం తీర్పు చెప్పారు.. 30 రోజులలోపు తీర్పు అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది. విజయం సాధించిన వినియోగదారురాలు తరపున న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ఫిర్యాదు వివరాలను వివరించారు.
కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమార్ భార్య బొమ్మిశెట్టి వెంకట నాగ దీప్తి మచిలీపట్నంలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు . 2024 జులై ఒకటో తారీఖున నాగ దీప్తి మచిలీపట్నం జిల్లా పరిషత్ ఎదురుగా గల టీవీఎస్ డీలర్ కసా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద 1,15,500 చెల్లించి టీవీఎస్ జూపిటర్ 125 కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తేదీ నుండి వాహనంలో తయారీలోపం వలన పలు ఇబ్బందులకు గురిచేసింది. ఏడుసార్లు సర్వీసింగ్ చేయించిన సర్వీసు డబ్బులు తీసుకున్నారు గాని బండిలోని లోపాన్ని సరిచేలేకపోయారు. వినియోగదారురాలు దీప్తి ఆమె భర్త లక్ష్మణ కుమార్ అనేక పర్యాయములు మచిలీపట్నం మరియు విజయవాడలోని కాసా మోటార్స్ వారిని సంప్రదించిన ఫలితం లేకపోయింది. విసిగివేసారిన వినియోగదారులు న్యాయం కోసం కృష్ణా జిల్లా వినియోగదారుల కమిషన్ లో 2025 జూన్ 30వ తారీఖున ఫిర్యాదు దాఖలు చేసింది. వినియోగదారుల కమిషన్ ఇరుపక్షాల వాద ప్రతివాదంలో విన్న పిదప, వాహనాన్ని శిక్షణ పొందిన మెకానిక్ తో పరీక్ష చేయించి వాహనం తయారీలో లోపం ఉన్న విషయాన్ని నిర్ధారించారు. టీవీఎస్ వాహనంలో తయారీలో ఉందని వినియోగదారులకు ఇబ్బంది కలగజేసినట్లుగా నిర్ధారిస్తూ కమిషన్ బుధవారం తీర్పు చెప్పింది. తీర్పు ప్రకారం 30 రోజుల్లోపు కొత్త వాహనం గాని లేదా వాహన ఖరీదును 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని 25 వేల రూపాయలు మానసిక ఒత్తిడికి గురి చేసినందుకు పదివేల రూపాయలు కోర్టు ఖర్చులు కింద చెల్లించాలని తీర్పు చెప్పారు.
వినియోగదారురాలు తరుపున లంకిశెట్టి బాలాజీ, లంకి శెట్టి సాయి ఫణి సంతోష్, చిన్నంశెట్టి ఆశా నాగ మౌనిక,మద్దాల సువర్ణ రాజు న్యాయవాదులుగా వ్యవహరించారు.
