ఉగాది నాటికి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం : సిఎం జగన్

హౌసింగ్ కోసం రూ, 8600 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.జిల్లా కలెక్టర్ లతో ఆయన మాట్లాడారు. ‘ఉగాది నాటికి ఇంటి స్థలం లేని పేదవాడు ఉండకూడదు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలి. కలెక్టర్లు దృష్టి పెట్టకపోతే ఇది సాధ్యం కాదు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. ఎంత మందికి ఇళ్లులేవో వీరిద్వారా లెక్కలు అందుతాయి.

ప్రభుత్వ భూమి లేకపోతే భూమిని కొనుగోలు చేయాలి. ప్రతి ఎకరాలో రోడ్లు మౌలిక సదుపాయాలు పోను ఎకరాకు సెంటున్నర చొప్పున 40 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఎంత భూమి అవసరమవుతుందో గుర్తించండి. ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తికావాలి. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారునికి తెలియని పరిస్థితి ఉండకూడదు. హౌసింగ్‌ కోసం రూ. 8,600 కోట్లు పెట్టాం. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇస్తున్నాం.

కలెక్టర్ల మీదే నా విశ్వాసం. నా బలం కూడా మీరే. మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే.. ఈ కార్యక్రమం కచ్చితంగా విజయవంతమవుతుంది. వచ్చే తరాలు కూడా మీ గురించి జిల్లాల్లో మాట్లాడుకుంటాయి. ఇవ్వాళ్టి నుంచే మీరు పని చేయడం మొదలుపెడితే గానీ ఉగాది నాటికి పూర్తి చేయలేరు. ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోండి. లబ్దిదారుల జాబితాను గ్రామ సెక్రటేరియట్‌లో పెట్టండి’ అని కలెక్టర్లకు విఙ్ఞప్తి చేశారు.

About The Author