చిన్నప్పుడు వదలిపోయిన తల్లిని .. భిక్షగత్తెగా చూసి గుర్తుపట్టిన కూతుళ్లు…


ఇద్దరు కూతుళ్లను వదిలి ఆ తల్లి ఇల్లు విడిచి వెళ్లింది.
బిడ్డలకోసం తండ్రి రెండోపెళ్లికూడా చేసుకోలేదు..
తల్లిలేని కూతుళ్లిద్దరూ బాగా చదువుకొని ఉద్యోగాల్లోఉన్నారు.. ఇన్నాళ్లూ పెంచి పోషించి, చదివించి వృద్ధిలోకి తెచ్చిన తండ్రి రెండువారాల కిందట చనిపోయాడు. అయితేనేం.. ఆ ఇద్దరు అనాథలు కాకుండా విధి కరుణించింది. చిన్నప్పుడే తమకు దూరమైన తల్లిని 14 ఏళ్ల తర్వాత సినీ ఫక్కీలో చేరువ చేసింది. తమిళనాడు తినల్వేలి సురండై చేనేతకాలనీకి చెందిన భాగ్యరాజ్‌ (50), జ్ఞానసెల్వి (45) దంపతులకు జపరాణి, షకీలా అనే కుమార్తెలున్నారు. జపరాణి పదేళ్ల వయస్సులో ఉన్నపుడు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జ్ఞానసెల్వి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. ఆమె కోసం వెతికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా దొరకలేదు.
పెద్ద కుమార్తె జపరాణి (24) నర్సింగ్‌ చదివి తిరునల్వేలీలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. చిన్నకుమార్తె షకీలా (22) రెండేళ్లుగా కోల్‌కతాలోని ఓ అతిథిగృహంలో ఉద్యోగం చేస్తోంది. అనారోగ్యంతో రెండువారాల కిందట భాగ్యరాజ్‌ మరణించాడు. తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యాక రెండురోజుల కిందట షకీలా తిరిగి కోల్‌కతాకు బయలుదేరింది. చెల్లిని సాగనంపేందుకు జపరాణి రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. తిరునల్వేలి జంక్షన్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో అక్కాచెల్లెళ్లు నడిచి వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న మహిళను చూసి ‘ఆమె మన అమ్మలా ఉంది కదూ’ అని జపరాణి తన చెల్లితో అంది. ఆ తర్వాత ఆమె వద్దకు వెళ్లి ‘ మీది సురుండై కదూ.. మీ పేరు జ్ఞానసెల్వినా’ అని ప్రశ్నించగా అవునంటూ సందేహంగా చూసింది.. అంతే ఆకాశమంత సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన అక్కా చెల్లెళ్లు ‘నీవు మా అమ్మవి.. మేము నీ కుమార్తెలం.. ఇంట్లో నీ పెళ్లి ఫొటో చూసి గుర్తు పట్టాం’ అని చెప్పారు. అంతే తల్లి సైతం ఆనందంతో ఉప్పొంగిపోయి బిడ్డలను దగ్గరకు తీసుకుంది. మిమ్మల్ని చిన్నతనంలోనే వదిలేసి వెళ్లానంటూ బిగ్గరగా ఏడ్చింది. తిరునెల్వేలి వవూసీనగర్‌లో నివసిస్తూ భిక్షమెత్తి బతుకుతున్నట్టు చెప్పింది. కుమార్తెలు ఎంతో అనందంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లారు.

About The Author