శ్రీ ఉమామహేశ్వరాలయం -యాగంటి

శ్రీఉమామహేశ్వరాలయం -యాగంటి, కర్నూలు జిల్లా ఆంద్రప్రదేశ్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వున్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం ‘యాగంటి’.

యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై వుంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్దపెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ప్రకృతి శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు, ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ వుంటాయి. ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు వుంటాయి. యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది.
యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది వినే వుంటారు. కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం వుంది. చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు.. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడని కూడా తెలుసు. కలియుగాంతం అవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంకె వేయడం కూడా ఒకటి అని తెలుసు. అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో వున్నాయి.

అగస్త్య పుష్కరిణి
****************
యాగంటి ఉమామహేశ్వరాలయంలో వున్న పుష్కరిణికి ‘అగస్త్య పుష్కరిణి’ అనే పేరు వుంది. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం పేర్కొంటోంది. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది. మండే ఎండల్లో అయినా, ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని చెబుతారు

బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన గుహ
************************************
పర్వతం మీద వున్న వివిధ గుహలకు, ఆలయాలకు చేరడానికి ఉన్న మెట్ల మార్గాలు చూడ్డానికి చాలా బాగుంటాయి. యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో వున్న ఉమా మహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే వుండే ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తూ వుంటారు.

యాగంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో వుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం వుంటుంది. యాగంటిలో వసతి సదుపాయం వుండదు. అందువల్ల కర్నూలు, నంద్యాల, బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి వుంటుంది. యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం. ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి అది
ఓం నమశ్శివాయ. !!
ఓం నమశ్శివాయ. !!

యాగంటి బసవన్న.!

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. నల్లమల, ఎర్రమల అడవుల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రానికి ఎంతో విశిష్టతలు వున్నాయి. ఈ మూడు శైవ క్షేత్రాలు ఇక్కడ కొండల నుండి నిరంతర జలధారలుప్రవహించటం చాలా ప్రత్యేకం. బనగానపల్లి మండలానికి దగ్గరలో యాగంటి అనే దివ్యక్షేత్రం వుంది. అద్భుతమైన శైవ క్షేత్రం. ఇక్కడ స్వామి వారు పరమశివుడు విగ్రహరూపంలో దర్శనమిస్తారు.బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఆలయం ముందున్న నందీశ్వరుడు కాలు దువ్వి రంకె వేస్తాడని అది భూమండలం దద్దరిల్లేలా ఆ రంకె వుంటుందని పేర్కొనటం జరిగింది.

అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది. ఈ ఆలయం యొక్క పరిసరప్రాంతాలలో ఒక్క కాకి కూడా కనిపించదు. దీనికి సంబంధించి ఒక చారిత్రాత్మక కథనం వుంది.

యాగంటి దేవాలయము కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.

About The Author