టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీలివే..

టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కేసీఆర్ ఇచ్చిన హామీలివే..

2018 మేనిఫెస్టో – ముఖ్యమైన హామీలు
1. అన్నిరకాల ఆసరా పెన్షన్లు రూ.1,000 నుంచి రూ.2,016 వరకు పెంచడం జరుగుతుంది. వికలాంగుల పెన్షన్లను రూ.1500 నుంచి రూ.3,016 వరకు పెంచడం జరుగుతుంది. బీడి కార్మికుల‌ పీఎఫ్‌ క‌టాఫ్‌ డేట్ ను 2018 వరకు పొడిగించడం జరుగుతుంది.
2. వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడం జరుగుతుంది.
3. నిరుద్యోగ సోదరులకు నెలకు రూ.3016 భృతి అందించడం జరుగుతుంది.
4. ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్నఅర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందించడం జరుగుతుంది.
5. రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయాన్ని 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది.
6. రైతులకు రూ. 1 లక్ష వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.
7. రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యుల‌కు గౌర‌వ భృతి అందించడం జరుగుతుంది.
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది.
9. చట్టసభల్లో బిసిలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పోరాడుతుంది.
10. ఎస్టీలకు 12 శాతం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం చేస్తుంది.
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
14. వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
15. అగ్ర కులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
16. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతుంది. ఐకెపి ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకెపి ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంది. ఈ యూనిట్లు తయారు చేసే కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.
17. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి, తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తుంది.
18. ప్రభుత్వ ఉద్యోగుల‌కు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ చేస్తుంది.
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వ‌య‌సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం జరుగుతుంది. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంచడం జరుగుతుంది.
20. పెన్ష‌న‌ర్ల‌ కోసం ప్ర‌త్యేక డైరెక్ట‌రేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
21. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపచేస్తుంది.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
23. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న వారికి పట్టాలు ఇస్తుంది.
24. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది.

About The Author