నేడు “పోలీసు అమర వీరుల దినోత్సవం”…


ఆ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితి.

పోలీసుల త్యాగనిరతి అమోఘమైనది. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ, పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. మనిషికి అత్యంత విలువైనది ప్రాణం. అలాంటి ప్రాణాన్ని త్యాగం చేయడం అన్నది అత్యున్నత స్థాయి త్యాగం. పోలీసులు దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం వారి విలువైన ప్రాణాలు అర్పించినప్పటికీ ఆ త్యాగాలు తగినంతగా గుర్తింపుకు నోచుకోవడం లేదు. ఈ త్యాగాలను గుర్తించి, ఆ త్యాగమూర్తులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. దేశ సరిహద్దులలో సైనికులు, అంతర్గత శత్రువులతో పోలీసు అసువులు బాస్తున్నారు. ప్రజలు పోలీసు వారి చిన్న చిన్న తప్పులను పరిగణనలోకి తీసుకోకుండా వారి త్యాగాల గురించి ఈ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా ఒక్క నిమిషం ఆలోచించి గుర్తించినా పోలీసులు సంతోషిస్తారు.

పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం

About The Author