ప్రియుడికోసం తల్లి,అక్కను ఇంట్లో బంధించింది…


ప్రియుడి కోసం ఓ మైనర్ బాలిక ఇంట్లో తల్లిని, అక్కను బంధించి ప్రియుడు వస్తే తప్ప తలుపు తీయనంటూ మొరాయించింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకున్నా పట్టు వీడలేదు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ ఒక కొరియర్ బాయ్ ని ప్రేమించింది. తర్వాత అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టడంతో కొరియర్ బాయ్ ని పోలీసులు అరెస్టు చేసి కిడ్నాప్, ఫోక్సో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో బాలికను ఆమె తల్లి కాలేజీకి పంపడం మానేశారు. ఇటీవల వాళ్ళిద్దరి మద్యా మళ్ళీ సంబంధాలు మొదలయ్యాయి. బాలికను తల్లి మందలించడంతో తల్లిని, అక్కను ఒక గదిలో వుంచి తాళం వేసి తాను వరండాలో వుంటూ మెయిన్ గేటుకు తాళం వేసింది. లోపలి నుంచి బిగ్గరగా అరుస్తూ నానా హంగామా చేసింది. ఆ బాలిక వల్ల తల్లి, అక్కకు ప్రాణహాని వుందని భావించి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తన ప్రియుడు రానిదే తల్లిని, అక్కను వదలనంటూ రచ్చ చేసింది. దీంతో పోలీసులు, తహసీల్దారు, ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రియుడు తండ్రి వచ్చి ఆ బాలికకు నచ్చజెప్పి తాళం తీయించాడు. మైనర్ బాలికకు వివాహం చట్టవిరుద్దమని చెప్పినా వినలేదు. దీంతో బాలికను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి తిరుపతిలో బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. తమ కుమార్తెను తాము వేధించడం లేదని, ఎప్పుడూచూసినా ప్రేమ ప్రేమ అంటూ కలవరిస్తోందని బాలిక తల్లి వాపోయింది.

About The Author