తమిళ నాట కొత్త రాజకీయం….


తమిళనాట రాజకీయాల్లో కొత్త పొత్తులు మొదలయ్యాయి.తమిళ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి సిద్ధమేనని సినీ స్టార్స్ మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల హాసన్, రజనీకాంత్‌ మంగళవారం వేర్వేరుగా వ్యాఖ్యానించారు. ఎంతో స్టార్ డం ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేసి డిసెంబరుతో ఏడాది కావస్తున్నా ఇంత వరకు రాజకీయ పార్టీపై ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే రజిని తన లక్ష్యం 2021 అసెంబ్లీ ఎన్నికలే అని చెబుతూనే…. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా మరో వైపు సమయానుగుణంగా రాజకీయ వ్యాఖ్యలను పేల్చుతూ వస్తున్నారు. అదే సమయంలో రజనీ కన్నా ముందుగా కమల్‌ మక్కల్‌ నీది మయ్యం పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లారు.
ఈ పరిస్థితుల్లో ఈనెల 8న కమల్‌ బర్త్‌డే సందర్భంగా రాజ్‌కమల్‌ కార్యాలయంలో జరిగిన దివంగత దర్శకుడు బాలచందర్‌ విగ్రహావిష్కరణకు రజనీ హాజరయ్యారు. తాను కాషాయం వలలో పడనని కమల్‌తో తన బంధం విడదీయరానిదిగా రజనీ వ్యాఖ్యానించారు. అలాగే రజనీకాంత్‌ను తనను ఎవరూ విడదీయలేరని, తమ మధ్య రహస్య ఒప్పందం ఉందని కమల్‌ వ్యాఖ్యానించి రాజకీయ చర్చకు తెరలేపారు. ఈ ఇద్దరు ఏకం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ మొదలైంది. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం రజనీ వ్యాఖ్యలు చేయడం, అందుకు తగ్గట్టుగా కమల్‌ స్పందించడం ఆ చర్చలకు బలాన్ని చేకూర్చాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తమిళనాట చర్చ జోరందుకునేలా చేశాయి. జయలలిత మృతి తరువాత రాజకీయ అనిష్చితిని వాడుకుని తమిళనాట పాగా వేయాలని కమల్-రజిని భావిస్తున్నట్లు టాక్..
రజిని- కమల్ తో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాడా అని మంగళవారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తమిళ ప్రజల సంక్షేమం కోసం తప్పని సరిగా కమల్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ఒడిశాలో జరిగిన డాక్టరేట్‌ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని చెన్నైకు వచ్చిన కమల్‌ మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. ఇద్దరు కలిసి పనిచేసేందుకు సిద్ధం కావడంతో తమిళ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయోఅని విశ్లేషకులు భావిస్తున్నారు. 4దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న కమల్,రజిని చరిష్మాను ఉపయోగించుకుని తమిళ ప్రజల కోసం కలయిక అవశ్యం అయితే సిద్ధమేనని వ్యాఖ్యానించారు. రజనీ, కమల్, కాకుండా మరో నటుడు విజయ్‌ కాంత్ కూడా రాజకీయాల్లో రాణిస్తున్నాడు. విజయ్ కూడా కమల్-రజినితో కలిసి నడిస్తే 2021 వరకు తమిళ రాజకీయాల్లో మార్పు ఖాయమని భావిస్తున్నారు.

About The Author