కేబీఆర్ పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్వే ట్రాఫిక్.

హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి శాశ్వత వన్వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. హెచ్-సిటీ ప్రాజెక్ట్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి అందుబాటులో ఉన్న విస్తీర్ణం కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకు తగ్గనుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు డ్రోన్ విజువల్స్, ట్రాఫిక్ సిమ్యులేషన్లు, సాంకేతిక అధ్యయనాల ఆధారంగా మార్గాలను రూపొందించారు. ఏప్రిల్ 5న 3 గంటలు, జూన్లో 6 గంటల పాటు నిర్వహించిన ట్రయల్ రన్ల అనంతరం అవసరమైన మార్పులు చేపట్టారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే విధానం అమల్లోకి రానుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి. ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట, బేగంపేట్, రోడ్ నంబర్ 10, 12, 36, 45, ఫిల్మ్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. పాదచారుల భద్రత కోసం కీలక కూడళ్ల వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేసి సుమారు 15 సెకన్ల పాటు వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు. కేబీఆర్ పార్క్కు ప్రతిరోజూ వచ్చే 1,500 నుంచి 2,500 మంది వాకర్లను దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారిపై పార్కింగ్ను కఠినంగా నిషేధించనున్నారు. అంబులెన్స్లకు నిరంతర రాకపోకలు సులభతరం అయ్యేలా ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నారు. కొత్త ట్రాఫిక్ విధానానికి ప్రజలు అలవాటు పడే తొలి 7 నుంచి 10 రోజుల్లో నాలుగు షిఫ్టుల్లో ట్రాఫిక్ సిబ్బందిని 24 గంటల పాటు కీలక కూడళ్ల వద్ద మోహరించి వాహనదారులకు మార్గనిర్దేశం చేయనున్నారు.
