సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు పుణ్యక్షేత్రాలు…

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు పుణ్యక్షేత్రాలు

శివపుత్రుడు కుమారస్వామికి ఆరు ముఖాలు ఉంటాయని చెబుతారు. ఆయనను ఆరుగురు అక్కచెల్లెల్లు పెంచారని కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆరు అనే సంఖ్యను ఆ స్వామికి ప్రతీకగా భావిస్తుంటారు. ఆయనకు ఎన్ని క్షేత్రాలు ఉన్నా, అందులో ఆరు క్షేత్రాలను మరింత మహత్యం ఉన్నవిగా పేర్కొంటారు. 15వ శతాబ్దంలో తమిళ భక్తి సాహిత్యంలో ఈ క్షేత్రాలను తొలిసారిగా పేర్కొన్నారట. వీటిని తమిళనాట ‘ఆరు పడై వీడు’ (ఆరు పుణ్యక్షేత్రాలు) అని పిలుస్తారు. అవేమిటంటే…

01. తిరుప్పారకుండ్రం –
ఆరు పైడైవీడులో ఇది తొలి క్షేత్రం. మధుర మీనాక్షిని దర్శించుకునేవారు, ఆ ఊరి పొలిమేరలో ఉన్న ఈ తిరుప్పారకుండ్రం ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు. ఇంద్రుని కుమార్తె దేవసేనని, కుమారస్వామి వివాహం చేసుకున్నది ఇక్కడే అని భక్తుల నమ్మకం.

02. తిరుచెందూరు
కుమారస్వామి ఆరు ప్రముఖ ఆలయాలలో సముద్రతీరాన ఉన్న ఏకైక ఆలయం తిరుచెందూరు. తిరువన్వేలి, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఈ ఆలయం కాస్త దగ్గరే! ఇక్కడ కుమారస్వామి, సూరపద్ముడు అనే రాక్షసుని మీద విజయం సాధించాడట!

03. పళని
తమిళనాట దిండుగల్ జిల్లాలో ఉన్న పళని కొండ తెలుగువారికి సుపరిచితమే! ఇక్కడ ఓ చిన్ని కొండ మీద ఉండే కుమారస్వామి దండాన్ని చేతపట్టుకుని ఉండాడు. అందుకునే ఆయనను ‘దండాయుధపాణి’ అని పిలుస్తారు. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని తొమ్మిది రకాల లోహాలతో రూపొందించడం మరో విశేషం.

04. స్వామిమలై
తమిళనాడులోని కుంభకోణం అనే ఊరుకి అతిసమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ కుమారస్వామి సాక్షాత్తు తన తండ్రి శివునికే ఓంకారం గురించి తెలియచేశాడట. స్వామిమలై కేవలం కుమారస్వామి ఆలయానికే కాదు, ఇత్తడి విగ్రహాల తయారీకి కూడా ప్రసిద్ధమే!

05. తిరుత్తణి
రాక్షసులతో యుద్ధం ముగిసిన తర్వాత, కుమారస్మామి సేదతీరిన ప్రదేశం ఇది. ఇక్కడే ఆయన వల్లీదేవిని వివాహం చేసుకున్నారు. తిరుపతి లేదా చెన్నైకి వెళ్లినవారు అక్కడికి సమీపంలోనే ఉండే ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి తీరుతారు.

06. పలముదిర్ చోలై
మధురై నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల నడుము, ఓ చిన్న కొండ మీద ఉందీ క్షేత్రం. అందమైన ప్రకృతి నడుమ, వల్లీదేవసేన సమేతంగా ఉన్న ఇక్కడి స్వామివారిని చూడటం ఓ దివ్యమైన అనుభూతి అంటారు భక్తులు.

About The Author