రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు…

రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు శనివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హోం మంత్రి శ్రీ మొహమ్మద్ మహ్మూద్ అలీ, చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎస్.కే. జోషీ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అలసత్వం, జాప్యం లేకుండా యుద్ద ప్రాతిపదికన పనులు చేయాలని కోరారు. సీతారామ, శ్రీరామ సాగర్ పునరుజ్జీవం పథకం పనులు మందకొడిగా నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, వర్క్ ఏజన్సీలతో, సంబంధిత అధికారులతో మాట్లాడి, సత్వరం పనులు పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు తానే స్వయంగా రెండు రోజుల పాటు నిర్మాణ ప్రాంతాలను సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజిలను, పంపుహౌజులను సీఎం మంగళవారం సందర్శిస్తారు. అనంతరం మరో రోజు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం కింద చేపట్టిన పనులను పరిశీలిస్తారు.

రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు సమగ్రంగా సమీక్షించారు. మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సి శ్రీ మురళీధర్, ఇతర అధికారులు ఎంపి శ్రీ బి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలపై కూలంకశంగా చర్చించారు. అధికారులకు తగు సూచనలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన భూములకు తక్షణం పరిహారం చెల్లించాలని ఆదేశించారు. గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల భూ నిర్వాసితులకు చెల్లించడానికి రూ.80 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం కోరారు. భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు కూడా వెంటనే పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పారు.

‘‘ఎస్.ఆర్.ఎస్.పి. పునరుజ్జీవన పథకం ద్వారా చేపట్టిన పనుల వల్ల వరద కాలువలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఆఫ్ టేక్ (ఓటి) తూముల ద్వారా అన్ని చెరువులకు నీరందించాలి. కాకతీయ కెనాల్ – ఫ్లడ్ ఫ్లో కెనాల్ మధ్యనున్న ఆయకట్టుకంతా నీరందించేలా. ఈ ప్రాంతంలోని అన్ని చెరువులు నింపాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘తెలంగాణలో ఎక్కువ భూభాగానికి నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరగాలి. వచ్చే జూన్, జూలై నాటికి నీరందించాలి. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాల్లో వేగం పెరగాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాళేశ్వరం పనుల్లో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. పనులను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చే మంగళవారం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణ ప్రాంతాలను సందర్శిస్తానని సీఎం చెప్పారు.

సింగూరుకు రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించి నారాయణఖేడ్ నియోజకవర్గానికి లక్ష, జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందరించాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీఎం కోరారు. కౌలాస్ నాలాను పటిష్టం చేయడంతో పాటు, నాగమడుగు పనులు చేయడం ద్వారా జుక్కల్ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని చెప్పారు. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.

సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు, శ్రీరామసాగర్ పునరుజ్జీవ పథకం, దేవాదుల ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని సీఎం అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి అవసరమైన 11వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని, పనుల్లో ఏమాత్రం జాప్యం, నిర్లక్ష్యం వహించవద్దని సీఎం అన్నారు. వర్క్ ఏజన్సీల బాధ్యులతో సీఎం స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఎస్.ఆర్.ఎస్.పి. పునరుజ్జీవ పథకం పనులను మే కల్లా పూర్తి చేస్తామని వర్క్ ఏజన్సీలు సీఎంకు మాటిచ్చాయి.

పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై త్వరలోనే మరోసారి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు

About The Author