భారత్ ‌@ 24గంటల్లో 194 మరణాలు…


దిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 3875 కొత్త కేసులు; 194 మరణాలు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య,  కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా 46711 పాజిటివ్‌ కేసులు, 1583 మరణాలు నమోదయ్యాయి. 
ఒక్కరోజులోనే 1399మంది రికవరీ
కరోనాతో పోరాడి కోలుకున్నవారి సంఖ్యా భారీగానే పెరుగుతుండటం విశేషం. ఒక్కరోజులోనే 1399 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 13,161గా ఉంది.
24గంటల్లో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలివే.. 
మహారాష్ట్రలో 1567; తమిళనాడులో 527; గుజరాత్‌లో 376; దిల్లీలో 349; పశ్చిమబెంగాల్‌లో 296 కేసులు నమోదు కావడం అక్కడి కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దంపడుతోంది.  
ఆ మూడు రాష్ట్రాల్లో ఉగ్రరూపం
దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 14541 మందికి ఈ వైరస్‌ సోకగా.. వారిలో 2465 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 583కి చేరింది. వీటిలో ముంబయి మహానగరంలోనే అత్యధిక మరణాలు నమోదవ్వడం గమనార్హం.  ఆ తర్వాత గుజరాత్‌‌లో 5804 కేసులు నమోదయ్యాయి. అక్కడ 1195 మంది కోలుకోగా.. 319 మంది మృత్యువాతపడ్డారు. దిల్లీలో 4898 కేసులు నమోదవ్వగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధానిలో కోలుకున్నవారి సంఖ్య 1431గా నమోదైంది.

About The Author