పాలు ఇలా కూడా పోస్తారా..! వ్యాపారి వినూత్న ఆలోచన..ఫొటో వైరల్


న్యూదిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పాల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పాలు పోసే సమయంలో కూడా భౌతికదూరం పాటించేలా ఉపాయం ఆలోచించాడు. ఓ పైపునకు గరాట జోడించి పాల క్యాన్లతోపాటు బైక్‌కు దాన్ని అమర్చుకున్నాడు. మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి ద్విచక్రవాహనంపై కూర్చొనే పాలు పోస్తున్నాడు. భౌతిక దూరం పాటించేందుకు ఇది ఓ చక్కటి ఉపాయమని అతడి వద్ద పాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఐఏఎస్‌ అధికారి నితిన్‌ సంగ్వాన్‌ ట్విటర్‌లో ఈ ఫొటో పోస్ట్‌ చేశారు. పాల వ్యాపారి ఆలోచనను మెచ్చుకున్నారు. ‘కొందరు వ్యక్తులు తమను, తమ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచడానికి వినూత్నంగా ఆలోచించడం సంతోషంగా ఉంది. ఇళ్లలో ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉందాం. ఈ పాల వ్యాపారిలా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా.. మాస్కు ధరించి, కనీస భౌతిక దూరం పాటిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘సృజనాత్మకత, పాల వ్యాపారికి కుడోస్‌, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్న ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్‌, ఇది నిజంగా గొప్ప ఆలోచన, ప్రజల్లో అవగాహన ఏర్పడటం ఆనందంగా ఉంది..’ అని రకరకాల పోస్ట్‌లు చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.

About The Author