వైకుంఠ ఏకాదశి విశిష్టత :

వైకుంఠ ఏకాదశి విశిష్టత :

నేడు ముక్కోటి ఏకాదశి.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల
ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.
ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.
పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!
మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.
విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు ‘ఏకాదశి’ అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.
ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.
ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.
అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.

·

వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసముంటే..?

వైకుంఠ ఏకాదశీ వ్రతం” ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైషవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు.
ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైనపుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు.
ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రదా ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.
ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.
అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది

About The Author