కరోనాకు రెమ్‌డెసివిర్ ఒకే …


కొవిడ్‌-19 చికిత్సలో యాంటీ వైరస్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ వాడేందుకు అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది. కరోనా నుంచి రోగులను రక్షించేందుకు అనేక ఔషధాల్ని పరీక్షిస్తున్న క్రమంలో రెమ్‌డెసివిర్‌ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్’‌(ఎఫ్‌డీఏ) ఈ డ్రగ్‌ ‘అత్యవసర వినియోగ అనుమతి’(ఈయూఏ)కి అంగీకరించింది. ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన ‘గిలీడ్‌ సైన్సెస్‌’ తయారు చేస్తోంది.
కొవిడ్‌-19తో ఆస్పత్రుల్లో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించినట్లైతేనే రెమ్‌డెసివిర్‌ను ఇవ్వాలని ఎఫ్‌డీఏ సూచించింది. ఎఫ్‌డీఏ నిర్ణయాన్ని స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గిలీడ్‌ సీఈఓతో కలిసి ప్రకటించారు. కొవిడ్‌-19 చికిత్సలో దీన్ని ఓ ముందడుగుగా సీఈఓ స్టీఫన్‌ హాన్‌ అభివర్ణించారు.
రెమ్‌డెసివిర్‌ తీసుకున్న రోగులు మిగతా ఔషధాలతో పోలిస్తే 31శాతం వేగంగా లేదా సగటున నాలుగు రోజులు ముందే కోలుకున్నారని ప్రభుత్వ అనుమతితో జరిపిన ఓ అధ్యయనంలో తేలిందని ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఈ ఫలితాల ఆధారంగానే తాజా అనుమతులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ డ్రగ్‌ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఇప్పటికే జరిపిన ప్రయోగాల్లో తేలినప్పటికీ.. మరిన్ని బలమైన, లోతైన ఆధారాలు సమర్పిస్తే పూర్తి స్థాయి వినియోగానికి అనుమతిస్తామని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.

About The Author