నా ఇంటికొస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తా: ఏపీ సీఐడీకి అనితా రాణి వార్నింగ్


ఇంటికి తాళం.. నా ఇంటికొస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తా: ఏపీ సీఐడీకి అనితా రాణి వార్నింగ్

తనను వైసీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అనితా రాణి వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసులో నిజానిజాలు తేల్చాలంటూ అనిత వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించారు సీఎం జగన్. విచారణలో భాగంగా చిత్తూరు చేరుకున్న సీఐడీ అధికారులు అనితా రాణికి ఫోన్ చేశారు.

అయితే తన ఇంటికి రావొద్దంటూ ఆమె తాళం వేశారు. తనకు సీఐడీపై నమ్మకం లేదని, సీబీఐతోనే న్యాయం జరుగుతుందని అనితా రాణి తేల్చిచెప్పారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని హైకోర్టూ చెప్పిందని ఆమె గుర్తుచేశారు.
ఒకవేళ తన ఇంటికి సీఐడీ వస్తే హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని అనిత తేల్చిచెప్పారు.

డాక్టర్ అనితా రాణి వాయిస్ రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సుధాకర్ ను వేదించినట్లే తనను కూడా వేధిస్తున్నారని చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అనితా రాణి ఆరోపించారు.

తన గోడును ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితకు ఫోన్ లో వెల్లబోసుకున్నారు. పెనుమూరు డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం కావడంతో మరింత దుమారం చెలరేగుతోంది.

తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారని, తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. బాత్రూంలో తన ఫొటోలు కూడా తీశారని ఆమె ఆరోపించారు. మార్చి 22వ తేదీన తనను వేధించారని అనితా రాణి ఫిర్యాదు చేశారు.

అయితే, అనితారాణి వ్యవహారంపై డీహెచ్ఎంవో రమాదేవి నివేదిక ఇచ్చారు. అనితా రాణిపై చాలా ఆరోపణలు ఉన్నాయని, ఆమె విధులు సరిగా నిర్వహించరని డిఎంహెచ్ఓ అన్నారు. వైద్యం కోసం వచ్చిన పిల్లలను కొడుతున్నారని అన్నారు. వైద్యం సరిగా చేయదని ఆరోపించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. నిజాయితీగా వృత్థి ధర్మానికి కట్టుబడినందుకు బూతులు తిడుతూ, ఫొటోలు తీసినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

About The Author