జూలై 11 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు గడువు 23

అమరావతి, జూన్‌ 15 ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై 11 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఫస్ట్‌, సెకండియర్‌ విద్యార్థులకు ఒకే షెడ్యూల్‌ అమలుకానుంది. ఫస్టియర్‌ పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్‌ పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు జూలై 1 నుంచి 4 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి,జూలై 5న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, జూలై 6న ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్న 1 గంటవరకు జరుగుతాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల అభ్యర్థులు ఈ నెల 23లోగా కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించాలి. ఫస్టియర్‌ పేపర్లు పాసైన అభ్యర్థులు మార్కుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ కోసం రాయదలచుకుంటే ఫీజు రూ.490కి అదనంగా ఒక్కో పేపర్‌కు రూ.160 కలిపి చెల్లించవలసి ఉంటుంది. వీరికి ప్రత్యేకంగా హాల్‌టికెట్‌ నెంబరు కేటాయించరు. మార్చిలో పరీక్షలు రాసిన హాల్‌టికెట్‌ నెంబరునే వినియోగించుకోవాలి.

ఫెయిలైన అభ్యర్థులు ఆయా పేపర్లతో పాటు పాసైన పేపర్లకు కూడా హాజరుకాదలచుకుంటే గతంలో పాసైన పేపర్ల పెర్ఫార్మెన్స్‌ను కోల్పోతారు. అలాంటి సందర్భంలో తాజాగా సాధించిన మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా అభ్యర్థులు పరీక్ష ఫీజుకు అదనంగా గతంలో పాసైన ఒక్కో పేపర్‌కు రూ.160 చెల్లించాలి. ఇంటర్‌ పరీక్షల సమాధాన పత్రాల రీ వెరిఫికేషన్‌ కమ్‌ స్కానింగ్‌ కాపీ సరఫరా, మార్కుల రీ కౌంటింగ్‌ కోరుకునే అభ్యర్థులు ఈ నెల 22లోగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

About The Author