ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లన్నీ.. సంపూర్తి కావాలి !

కడప, జులై 6 : ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఉదయంకు ఏ మాత్రం కొరత లేకుండా సంపూర్తి చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశించారు. ఈ నెల 7,8 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్, ఆర్జియూకెటి చాన్స్ లర్  కేసి రెడ్డిఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఇడుపులపాయ ఎస్టేట్ లోని ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిపాడ్, త్రిబుల్ ఐటి, వైఎస్ఆర్ ఘాట్, వైఎస్ఆర్ నూతన విగ్రహం ఏర్పాట్లు, నూతనంగా చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించి శిలాఫలకాల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఇడుపులపాయ ఎస్టేట్ లో ముఖ్యమంత్రి బసచేయనున్న దృష్ట్యా.. అక్కడి ఏర్పాట్లను క్షున్నంగా పరిశీలించారు.  హెలిపాడ్ వద్దకు వచ్చే విఐపీ లకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ను పరిశీలించారు. ఘాట్ వద్ద ప్రత్యేకమైన పూల అలంకరణ, పూల మాలలు, మొదలయిన అలంకరణను శోభాయమానంగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యమంత్రి తిరిగే పరిసరాలన్నింటినీ అత్యంత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 

అనంతరం ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక విగ్రహాన్ని కలెక్టర్ పరిశీలించారు. విగ్రహానికి  అలంకరించే పూలమాలలు తదితరాలపై సలహాలు ఇచ్చారు. అలాగే దాదాపు రూ.140 కోట్లతో నిర్మించిన త్రిబుల్ ఐటీ తరగతి భవనాలను పరిశీలించి.. ముఖ్యమంత్రి ప్రారంభించే శిలాఫలకాలను పరిశీలించారు. అలాగే రూ.10.10 కోట్ల వ్యయ అంచనాతో నిర్మించనున్న నూతన కంప్యూటర్ ల్యాబుకు, 3 మెగా వాట్ల సమర్థ్యంతో నిర్మించే సోలార్ పవర్ ప్లాంటుకు, రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అధునాతన ఆడిటోరియం నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి అవిష్కరించనున్న శిలాఫలకాల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమాలను దృశ్య శ్రవణ ప్రదర్శన ద్వారా కూడా అందరూ తిలకించేలా ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(SOP) తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా నిర్ణీత సంఖ్యలో ముందస్తుగా అనుమతించిన వారినే ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతించడం జరుగుతుందని, ఆ మేరకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. ఇడుపులపాయ ఎస్టేట్, ట్రిపుల్ ఐటిలలో పనిచేసే వారు, ముఖ్యమంత్రి పర్యటన విధుల్లో పాల్గొనే వారందరికీ ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి బసచేసే గెస్ట్ హౌస్ తోపాటు ముఖ్యమంత్రితో పాటు వచ్చే సీఎంఓ అధికారులు, కార్యదర్శులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లను చేయాలన్నారు.  ముఖ్యమంత్రి బస చేసే రోజుల్లో ఎలాంటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టి.. ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ విధిగా అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయాలని ఆదేశించారు.  ముఖ్యమంత్రికి పలు వినతులు అందించేందుకు.. వచ్చే వారికి ప్రత్యేక తాత్కాలిక స్పందన (గ్రీవెన్స్ సెల్) కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గట్టి భద్రతతో బారికేడ్లను ఏర్పాటు చేసి వినతిపత్రాలు సేకరించేందుకు 50 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపత్యంలో ఆర్.కె.వ్యాలీ పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించే ఉద్యేశ్యంతో.. ఆయన త్రిబుల్ ఐటి నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఎన్నో అభివృద్ధి పథకాలకు బీజం వేశారని.. ఆయన తదనంతరం ఆయన తనయుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. జులై 8న వైఎస్ఆర్ జయంతి రోజున ఆయన స్మారక విగ్రహాన్ని ముఖ్యమంత్రి అవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్బంగా కోరారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అన్బు రాజన్, జేసీ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ ,  డైరెక్టర్ సుధీర్ ప్రేమ్ చంద్, జెడ్పి సీఈఓ సుధాకర్, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, జిఎన్ఎస్ఎస్ ఎస్డిసి సతీష్ చంద్ర, స్టెప్ సీఈవో డా.రామచంద్రా రెడ్డి,  రిమ్స్ సూపరింటెండెంట్ ప్రసాద రావు, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడి మధుసూదన్ రెడ్డి, ఆర్&బి ఎస్ఈ నాగరాజు, డిఎస్పీలు వాసుదేవన్, లోసారి సుధాకర్, స్థానిక రెవెన్యూ అధికారులు, తదితర శాఖల అధికారులు, ఇంజనీర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

డివిజనల్ పిఆర్వో, స.పౌ.సం. శాఖ. రాజంపేట వారిచే జారీ చేయబడినది.

About The Author