డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధం …


డిసెంబర్ నాటికి భారత్‌లో 10 కోట్ల డోస్‌ల కరోనా వైరస్ వ్యాక్సిన్లను సిద్ధం చేసేలా సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రయత్నాలు చేస్తోంది. అస్త్ర జెనికా అనే కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా కరోనాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఇది. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యే నాటికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ ట్రయల్ రన్ చివరి స్టేజీ ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. అస్త్ర జెనికా వైరస్‌పై సత్ఫలితాలను ఇచ్చినట్టు తేలితే వెంటనే భారీ ఎత్తున ఉత్పత్తిని ప్రారంభించేందుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంటామని ఆ సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా బ్లూంబర్గ్‌కు తెలిపారు.
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఈ అస్త్ర జెనెకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.

సీరం ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే 40 మిలియన్లు వ్యాక్సిన్ డోస్‌లను సిద్దం చేసింది. సొంత రిస్క్ మీద వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసింది. ఒకవేళ చివరి ఫలితాల్లో ఏమైనా తేడా వస్తే వాటిపై పెట్టిన ఖర్చంతా వృధానే. ఆ ఒప్పందం ప్రకారం ముందస్తుగానే ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చిన అస్త్ర జెనెకా ఫార్ములాతో సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం అస్త్ర జెనెకా వ్యాక్సిన్ యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో భారీ ఎత్తున టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని ఫలితాలు సానుకూలంగా ఉండడంతో ఆ సంస్థ ధీమాగా ఉంది. ప్రస్తుతం కరోనా మహమ్మారికి అది మంచి మందని భావిస్తోంది.కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మొదట కోవిడ్ వారియర్స్‌పైనే సహజంగా దృష్టి సారిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, వాళ్లే ఇందుకు సంబంధించి ఓ ప్రాధాన్యత క్రమాన్ని రూపొందిస్తారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వ్యాక్సిన్ ను నిల్వచేయడానికి 28,000 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలియజేశారు. వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నామని అన్నారు. అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తోందని.. మళ్లీ కొన్ని నెలల తరువాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు.

మరోవైపు కరోనా నివారణ కోసం రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ (Sputnik V vaccine) భారత్‌కు చేరింది. హైదరాబాద్‌లో ఆ వ్యాక్సిన్ రెండు, మూడు విడతల క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయి. వీటిని ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్వహించనుంది. ఈ మేరకు రెడ్డీస్ ల్యాబ్, రష్యా డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్డీఐఎఫ్​)ల మధ్య ఒప్పందం కుదిరింది

About The Author