పండుగ వేళ విషాదం…


వర్గల్‌(గజ్వేల్‌): కాసింత నిర్లక్ష్యం పసిబాలుడి ఉసురు తీసింది. ఇంటి ఎదుట రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారిని ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు చిదిమేసింది. పండుగ సంబురాలకు సిద్ధమవుతున్న వేళ శుక్రవారం ఈ విషాదకర ఘటన మండల కేంద్రం వర్గల్‌లో చోటు చేసుకుంది. గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన ప్రకారం..వర్గల్‌కు చెందిన బోయిని సాధు–మాధవి దంపతులకు శశివర్ధన్‌(7), యశ్వంత్‌(4) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యశ్వంత్‌ ఇంటి ఎదుట రోడ్డుపై ఆడుకుంటున్నాడు. అదే సమయంలో పక్కింటికి మామిండ్ల సంపత్‌ అజాగ్రత్తగా ట్రాక్టర్‌ను నడుపుతూ వచ్చి బాలుడిని ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో గాయపడిన చిన్నారి యశ్వంత్‌ను వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించగా అప్పటికే మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరుమన్నారు. నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయని హృదయవిదారకంగా విలపించారు. సరిగ్గా దీపావళి పండుగ వేడుకలు జరుపుకోవాల్సిన తరుణంలో ఆ కుటుంబం పెనువిషాదంలో కూరుకుపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి బోయిని సాధు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరన్న తెలిపారు

About The Author