భార్య రెండు నెలల గర్భిణి, ఆమంటే భర్తకు ప్రాణం, కానీ?


పెళ్ళయి 14 నెలలు. ఇప్పుడు రెండు నెలల గర్భిణి. కూతురు గర్భవతి అయ్యిందన్న విషయం ఆ కుటుంబంలో ఎన్నో రోజులు సంతోషాన్ని మిగల్చలేదు. ఒక్కసారిగా ఆవిరైపోయాయి. అదనపు కట్నం వేధింపులు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అత్త వేధింపులు ఎక్కువవడంతో ఆ అభాగ్యురాలు లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది.అనంతపురం జిల్లా యాడి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన బాబా ఫకృద్ధీన్‌కు కర్నూలుజిల్లా పత్తికొండ గ్రామానికి చెందిన రిజ్వానాతో 14 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో 15 తులాలకు పైగా బంగారం.. మూడులక్షల దాకా డబ్బులు ఇచ్చి వివాహం చేశారు.అయితే ముందు నుంచి అదనపు కట్నం కోసం ఫకృద్ధీన తల్లి రిజ్వానాను వేధిస్తూ ఉండేది. తనను తాను సముదాయించుకుంటూ ఎన్నోసార్లు తట్టుకుంది రిజ్వానా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గర్భవతి కూడా అయ్యింది. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ఆనందంలో ఉండేది రిజ్వానా.అయితే బిడ్డ పుట్టేకన్నా ముందే నిన్ను మీ పుట్టింటికి పంపిచేస్తాను.. వచ్చేటప్పుడు డబ్బులు తీసుకునే ఇంటికి రా అంటూ అత్త గొడవకు దిగింది. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పాటు తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం ఏమాత్రం ఇష్టం లేని రిజ్వానా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త ఉద్యోగానికి వెళ్ళడంతో పాటు అత్త షాపుకు వెళ్ళడంతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు గల కారణాలు లేఖ రాసి చనిపోయింది. రిజ్వానా చనిపోయిందని తెలుసుకున్న భర్త బోరున విలపిస్తున్నాడు.

About The Author