కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌పై అధికారుల‌తో టిటిడి అదనపు ఈఓ స‌మీక్ష


            కోవిడ్-19 రెండవ విడత వ్యాప్తి నేపథ్యంలో శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భక్తులు, వారికి సేవ‌లందించే ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో స‌మీక్ష‌ నిర్వహించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

–  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్ర‌తి 2 గంట‌లకోసాని శానిటైజ్ చేస్తున్నాం.

–   సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గింపు. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల భక్తులు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

–  అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఏర్పాటు.

– అద్దె గదుల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి. ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శానిటైజ్.

–  తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ లు తెచ్చుకోవాలి. శానిటైజ‌ర్ ప్ర‌తి రెండు గంట‌ల‌కోసారి వినియోగించాలి.

–  వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయంలో టిటిడి ఏర్పాటు చేసిన శానిటైజర్లు భక్తులు ఉపయోగించుకోవాలి.

– క్యూలైన్ల‌లో కాలితో నొక్కే శానిటైజ‌ర్లు ఏర్పాటు.

–  తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులు భౌతిక దూరం పాటించాలి.

– కోవిడ్ పరిస్థితులను అంచనా వేసుకుని రానున్న రోజుల్లో అవ‌స‌ర‌మైతే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా  తగ్గిస్తాం.

– టైంస్లాట్ దర్శన టోకెన్లు పొంది రోడ్డు మార్గంలో వచ్చే భక్తులను అలిపిరి చెక్ పాయింట్ వద్ద ముందురోజు మధ్యాహ్నం 1 గంట నుండి మాత్రమే అనుమతిస్తాం.

– టైంస్లాట్ దర్శన టోకెన్లు గల నడకదారి భక్తులను అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాల్లో ముందురోజు ఉదయం 9 గంటల నుండి మాత్రమే అనుమతిస్తాం.

– దర్శన సమయానికి అరగంట ముందు మాత్రమే భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోకి అనుమతి.

– అలిపిరి వద్ద ప్రతి వాహనాన్నీ శానిటైజ్ చేస్తున్నాం. భక్తులందరికీ థర్మల్ స్కాన్ చేస్తున్నాం.

– జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు త‌మ తిరుమల యాత్ర‌ను వాయిదా వేసుకోవాలి.

– ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేయిస్తున్నాం. దీన్ని అన్ని విభాగాల అధికారులు విధిగా ప‌ర్య‌వేక్షించేలా సూచ‌న‌లిచ్చాం.

– కోవిడ్ జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై రేడియో బ్రాడ్‌కాస్టింగ్ విభాగం ద్వారా 5 భాష‌ల్లో నిరంత‌ర ప్ర‌చారం చేస్తున్నాం. యాత్రికులు చేయాల్సిన‌వి, చేయ‌కూడ‌ని అంశాల‌తో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే కూడ‌ళ్ల‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు.

        ఈ స‌మీక్ష‌లో చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సిఎంవో డాక్ట‌ర్ న‌ర్మ‌ద ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

About The Author