డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఇకపై ,ఆర్టీవో, కార్యాలయలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మీరు డ్రైవింగ్‌ నేర్చుకోవాలని అనుకుంటున్నారా..? లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలా..? అయితే కేంద్ర సర్కార్‌ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల గురించి తెలుసుకోండి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఇకపై ప్రాంతీయ రవాణా కార్యాలయలకు (ఆర్టీవో) వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు అక్కడ డ్రైవింగ్‌ పరీక్షలో పాల్గొనాల్సిన అవసరమూ ఉండదు. సెంట్రల్‌ మోటారు వెహికల్స్‌ రూల్స్‌కు సవరణలు చేస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తీకొచ్చిన కొత్త నిబంధనలు గత నెల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్‌ ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం స్థానిక రవాణా శాఖ కార్యాలయం చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

డ్రైవింగ్‌ టెస్ట్‌ తప్పనిసరి కాదు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేవారు స్థానిక ఆర్టీవో అధికారుల సమక్ష డ్రైవింగ్‌ టెస్ట్‌ తప్పనిసరి కాదు అని నిబంధనలలో పేర్కొన్నారు. దీనికి బదులుగా ఫామ్ 5బీని తెరపైకి తీసుకొచ్చారు. డ్రైవింగ్‌ నేర్చుకునే వారికి ఇంధనాన్ని పొదుపు చేసే డ్రైవింగ్‌ విధానాలను నేర్పించడంలో కూడా శిక్షణలో భాగం చేసింది కేంద్రం.

మరి కొత్త నిబంధనలు ఏమిటి..?

సెంట్రల్‌ మోటారు వెహికల్స్‌ రూల్స్‌లోని రూల్‌ నెంబర్‌ 14లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది ఉంటుంది. లెర్నర్స్ లైసెన్స్, గుర్తింపు పొందిన లైసెన్స్ స్కూల్ నుంచి ధ్రువపత్రం లాంటివి తప్పనిసరని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తాజాగా అధికారుల ముందు డ్రైవింగ్ తప్పనిసరనే నిబంధనను తొలగించారు. దీనికి బదులు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన ‘డ్రైవింగ్ స్కూళ్ల’లోనే డ్రైవింగ్ పరీక్షలు పూర్తి చేసుకొని ఫామ్ 5బీని తీసుకొస్తే చాలు. అంటే మనం డ్రైవింగ్ నేర్చుకున్న స్కూల్‌లోనే అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని ఆ సర్టిఫికేట్లను ఆర్టీవో కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

డ్రైవింగ్‌ స్కూళ్లకు అనుమతి తప్పనిసరి

డ్రైవింగ్ స్కూళ్లకు ఇలాంటి అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం.. వాహన తయారీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు సంస్థలు డీటీసీలను ఏర్పాటు చేసేందుకు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను జారీ చేసేందుకు అనుమతినిచ్చింది. శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలు ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకొన్న 60 రోజుల్లో వాటికి గుర్తింపు లభిస్తుంది. డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేసే సంస్థలకు కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989లో నిర్దేశించిన మేరకు మౌలిక వసతులు, స్థలం ఉండాలి. అయితే ఈ నిబంధనలు ఏపీలో రాగా, తెలంగాణలో ఇంకా ప్రారంభం కానట్లు సమాచారం.

About The Author