కనుమరుగవుతున్న ఆనాటి పెళ్ళి ముచ్చట్లు…


పెళ్ళిలో భోజనాలంటే ఒక పెద్ద యఙ్ఞంలా వుండేది, సరదాగానూ వుండేది. భోజనాలకి పిలుపుల దగ్గరనుంచి భోజనాలు కార్యక్రమం పూర్తి కావడం ఒక పెద్ద వేడుక. ఐదురోజుల పెళ్ళిలో చెప్పేదేముంది, పూట పూటా సంబరమే…

పెద్దపెద్ద మండువా లోగిళ్ళుండేవి. మండువాలో ఒక పక్క ఆకులేస్తే ఒక పాతిక మందికి భోజనానికి సరిపడేది. ఇలా నాలుగుపక్కలవేస్తే దగ్గరగా వొక వంద మంది ఒక సారి భోజనం చేయడానికి వీలుండేది. ఇలా వీలు లేక పోతే దొడ్డిలో ఒక పెద్ద పందిరివేసి దానిని గదులుగా కట్టి గాలి వెలుతురు కోసం మనిషి పై ఎత్తు నుంచి ఖాళీగా వదిలేసే వారు. అలా కట్టిన వాటిలో నేల చదును చేసి కళ్ళాపు జల్లి అలికిన మట్టి ఇంటిలా తయారు చేసేవారు. భోజనాలకి కూచోడానికి ఈతాకుగాని, తాటాకు చాపలుగాని వేసేవారు. కింద కూచుని భోజనం చేసేవారు.

సాధారణంగా అరటి ఆకులు వుపయోగించే వారు. అత్యవసర పరిస్థితులలో అడ్డాకులు వాడేవారు. ఇక్కడ కూడా ఒకసారి వంద మంది పైగా ఒక సారి భోజనాలు చేసేందుకు సావకాశం ఉండేది.

పంక్తులుగా ఆకులేసి, అందరూ కూచున్న తరవాత వడ్డన ప్రారంభించేవారు. భోజనానికి, వడ్డనకి ఒక క్రమం ఉంది. నేటి ప్రోటోకోల్ లాగా! ముందు పప్పు, కూరలు, పచ్చళ్ళు, వూరగాయ, పిండివంటలు అన్నీ అయిన తరవాత అన్నం పెట్టేవారు. వడ్డన ప్రారంభించిన వెంటనే పెట్టినవి తినెయ్యకూడదు. అందరూ ఒక సారి తినడం మొదలు పెట్టాలి. వడ్డన అంతా పూర్తి అయినతరవాత గోవిందనామ స్మరణతో భోజనం ప్రారభమయ్యేది. అసలు సిసలు వడ్డన ఆ తరవాత ప్రారంభమయ్యేది,తినడం ప్రారంభించిన తరవాత. యువకులు యువతులు వడ్డన చేసేవారు. పంచకట్టి ఆపైన తువాలు మొలకి గట్టిగా బిగించేవారు యువకులు. యువతులు పమిట పూర్తిగా వేసుకుని ఆ కొంగు మొలలో దోపుకును వడ్డనకి ఉపక్రమించే వారు.

వడ్డన సామానుల పేర్లే మరిచిపోతున్నారు,ఇప్పుడు. పులుసు వడ్డించడానికి వాడేపాత్రని గోకర్ణం అనేవారు. మొదటిది పప్పు, ఇది పట్టుకుని ఒకరు, నెయ్యి పట్టుకుని ఒకరూ బయలుదేరేవారు. పప్పు వేసే అతను పప్పండి, మీకండి, పప్పండి,పప్పండి,పప్పండి అని వడిగా అంటు కదిలేవాడు. వెనకాల వచ్చే నెయ్యి తెచ్చినతను నెయ్యండి, నెయ్యండి,నెయ్యండి అంటూ వేసుకుంటూ వెళ్ళేవాడు. ఈ మాటలు గబగబా అంటే మరొక అర్ధం స్ఫురిస్తుంది. అని చూడండి. ఆ తరవాతది కూర. కూర తెచ్చినతను కూరండి, కూరండి, కూరండి అంటూ కావలసిన వాళ్ళకి వేసుకుంటూ వెళ్ళేవాడు. మధ్యలో అన్నం బుట్ట పట్టుకుని ఒకరు వచ్చేవారు. వేడిఅన్నం తాటాకు బుట్టలో పెట్టుకుని, బుట్ట చేతిమీద పెట్టుకుని, కాలకుండా బుట్ట కింద అరటాకు వేసుకుని ఒక హస్తంలాటి దానితో అన్నం వడ్డించేవారు. వీరు అన్నమండి తో ప్రారంభించి, మీకన్నమండి,మీకన్నమండి, మీకన్నమండి అంటూ సాగిపోయేవారు. మీకు+అన్నమండి=మీకన్నమండి అయిపోయింది. ఈ మాటలన్నీ వడిగా అంటేనే ఆ అందం అర్ధం స్ఫురిస్తాయి. పప్పుతో పులుసు వడ్డించేవారు. ఈ పులుసుని పులుసండి నుంచి పులసండి, పులసండి అనుకుంటూ వెళ్ళేవారు. పులసండి కి అర్ధం పులవమని. ఈ మాటలని కొంతమంది యువకులు ఆటపట్టించడానికి కూడా వాడే వారు, గబగబా అంటూ. పప్పుతో కాకుండా పులుసు వేరేగా కలుపుకుని తినేవారు. అప్పుడు నంజుడుకి వుండటానికి వడియాలు, అప్పడాలు వేసేవారు. ఒక కొంటె యువకుడు పంక్తిలో ఒక తాతగారి దగ్గరకెళ్ళి తాతగారు వడియాలు కావాలా అని అడిగేవాడు. ఆయన కావాలంటే ఒక పెద్ద కేక వేసేవాడు! ఒరేయ్ సుబ్బన్నా! ఇక్కడ తాతగారికి వడియాలు కావాలి పట్రా అని. అంటే తాతగారికి పడుచుపెళ్ళాం కావాలంటున్నాడురా అని ఎద్దేవా అన్న మాట. నిజంగా ఇందులో పైకి ఏ విచిత్రమూ లేదు కాని అసలు కొంటె తనం వుంది. తాతగారు కొద్ది ఘటికుడైతే మరొకలా సాగేది. కావాలని వడియాలు తెచ్చినతరవాత ఇదేమిటి ఇవితెచ్చేవూ అనేవాడు. మీరేగా వడియాలుకావలన్నారని అనేవాడు, యువకుడు.అప్పుడు తాతగారు ఒర్నీ! వడియాలంటె పడుచుపెళ్ళాన్ని తెస్తావనుకున్నారా అనేవాడు. మరోలా కూడా సాగేది. ఏమిటీ అన్నారూ అనేవాడు, ముసలాయన. వడియాలుకావాలా అని మళ్ళి అడిగేవాడు, యువకుడు. ఈ తాతగారు ఘటికుడు కనక వడియాలు నాకెందుకూ అనేవాడే కాని వద్దనేవాడు కాదు. తాతా! పెళ్ళిచేసుకుంటావా అంటే పిల్లనిచ్చేవాడెవడురా! అనేవారుకాని వద్దనేవారు కాదు!. అది ఒక సరదా.! వడియాలు నేనేమి చేసుకోనూ అనేవాడు. అంటే నమలడానికి పళ్ళు లేవనీ అర్ధం, పడుచు పెళ్ళాంని నేనేమి చేసుకోనూ అని కూడా అర్ధం వచ్చేది. పోనీ అప్పడాలు కావాలా అంటే, అప్పడాలు ఇప్పటిదాకా నాదగ్గరే వుండాలి, ఎక్కడుందో చూడునాయనా అనేవాడు. ఒకవేళ భార్య పక్కనుంటే అప్పడాలు పక్కనే వుందిగా అనేవాడు.

ఇప్పుడర్ధమైనదనుకుంటాను, అప్పడాలు ( అప్పటి+ ఆలు= అప్పటాలు, అప్పటియాలు, అప్పడాలు అనగా పాత భార్య) వడియాలు అనగా ( వడి+ఆలు= వడియాలు వడి అనగా వేగం, విసురు అని అర్ధాలు, అనగా పడుచు భార్య). ఒక్క మంచినీళ్ళు పోసేవారు మాత్రమే మాట్లాడకుండా ఖాళీ గ్లాసుల్లో మంచినీళ్ళుపోసేవారు. ఇక చివరిది పెరుగు, పెరుగు తెచ్చినవారు పెరుగండి నుంచి పెరగండి నుంచి వడిగా అనడం లో జరగండి దాకా వెళ్ళిపోయేది. అంటే ఇక తిన్నది చాలు లేవండి అన్నట్లుగా.భోజనాల దగ్గరనుంచి అంతా ఒక సారి లేచేవారు, గోవింద నామ స్మరణ చేస్తూ. పంక్తి లో ఎవరేనా తినడంలో వెనక పడితే వారికోసం అందరూ వారి భొజనం పూర్తి అయ్యేదాకా కూచుని వుండేవారు. ఇది వారి పట్ల చూపే గౌరవం. మన వాళ్ళు భోజనాలలో కూడా ఇలాసరదా చూపేవారు. అలా సందడి సందడిగా భోజనాలు ముగిసేవి.

ఇప్పుడు ప్లేట్లు పట్టుకుని క్యూలో నుంచుని కావల్సినవి వేసుకుని/వేయించుకుని కొండొకచో ఒంటి కాలిమీద నిలబడి/ ఎక్కడో ఒకచోట కూచుని భోజనం కానిచ్చేస్తున్నాం మరి. మాధాకోళం బ్రతుకులైపోయాయని ఒక పెద్దాయన వాపోవడం విన్నాను . అందం, హాస్యం చచ్చిపోయాయి.

మీరేమంటారు !

About The Author