తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం: ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన


మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు.. ప్రకాశ్‌ రాజ్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్‌ ఘన విజయం సాధించగా, ఇక ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి కొందరు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ప్రకాశ్‌ రాజ్‌ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ‘గెలిచిన మంచు విష్ణు, అతడి ప్యానల్‌ సభ్యులకు శుభాకాంక్షలు. ఒక ప్రణాళిక ప్రకారం వచ్చారని వాటన్నింటిన నేరవేర్చండి. ఇక ఈ ఎన్నికల్లో ఎలా ఓడిపోయాం, గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ‘మా’ ఎన్నికలు రాజకీయ వేదిక కాదు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కానీ ఎవరెవరు నాకు ఓటు వేశారో తెలియదు. రాజకీయం,సినిమా రెండు వేరు అనుకుంటున్నా. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పా. నేను తెలుగు వాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. ఇది ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఓటమిని జీర్ణించుకున్నాకే రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. అనంతరం తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘అసోసియేషన్‌కు ఒక నాయకత్వం వహించిన మీకు, తెలుగువాడు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్‌ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా. అలాగే ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్‌ మెంబర్‌గా ఉండకూడదు. పెద్ద నటులు కోట శ్రీనివాస రావు, రవిబాబు వ్యాఖ్యలను గౌరవిస్తాను. వారి చెప్పినట్టుగానే అతిథిగా ఉంటా. మీరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం గెలిచిందంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ కూడా ట్వీట్‌ చేశారు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

About The Author