ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశాలు


ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినెట్ మొదటగా చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హరీష్ రావు రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా కేబినెట్ కు వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకొని, వారితో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి సహకరించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
వ్యవసాయశాఖపై…
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నాడు సిఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. సిఎం వెంట వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.
రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని కేబినేట్ సమీక్షించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంతవరకు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
విద్యారంగంపై…
రాష్ట్రంలోని విద్య పై కేబినెట్ సుధీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణ గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని కేబినెట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్ భావించింది.
వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేపట్టినట్టయితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని కేబినెట్ భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులను ప్రాధమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడా మైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రయివేట్ కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ నిర్ణయించి ఈ మేరకు విద్యాశాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూల్ల పై సర్వత్రా వ్యతరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్ చర్చించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా…ప్రయివేటు స్కూల్లు జూనియర్ డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు నూతన చట్టాన్ని తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం చేసి విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.
తెలంగాణ రాష్ట్రంలో ‘మహిళా యూనివర్సిటీ ఏర్పాటు’ కోసం విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్ సమావేశానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సిద్దం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కొత్త చట్టం రూపొందించాలని మరియు వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై ప్రణాళికలు రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి, సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు.
విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్,శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ జగదీశ్ రెడ్డి, శ్రీ హరీశ్ రావు, శ్రీ ప్రశాంత్ రెడ్డి ,శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ కేటీఆర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన మరియు మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో ‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
మన ఊరు – మన బడి ప్రణాళిక :
ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం విద్యాశాఖలో ‘‘మన ఊరు – మన బడి’’ అనే వినూత్న కార్యక్రమానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే ప్రకటించిన విధంగా రెండేండ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్రంలోని పాఠశాలల సమగ్రాభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతారు.
ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు, వాటితో పాటు అదనపు తరగతి గదులు ఏర్పాటు, మరమ్మత్తులు, అవసరమైన మేరకు ఫర్నిచర్, మరుగుదొడ్లు మరియు ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక ఉద్దేశ్యం.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశానుసారం.. ఈ కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం మంత్రుల బృందం ఇప్పటికే 23 మార్చి 2021, 8 ఎప్రిల్ 2021, 17 జూన్ 2021 తేదీలలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, కెటిఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కూడిన మంత్రుల బృందం సమావేశమైంది.
‘‘మన ఊరు – మన బడి’’ అమలు కోసం మంత్రుల బృందం పలు అంశాలను పొందుపరిచి విధివిధానాలను రూపొందించింది.
ఇందులోని ముఖ్యాంశాలు :
1. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం గా చేపట్టి మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం.
2. 2021 – 22 విద్యా సంవత్సరం మొదటి దశలో, మండల కేంద్రాన్ని యూనిట్ గా తీసుకొని అన్ని రకాల (ప్రాథమిక పాఠశాల, మాద్యమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలల్లో) అత్యధికంగా ఎన్ రొల్మెంట్ అయిన 9,123 (35% స్కూళ్లలో 65% విద్యార్థులను) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి.
3. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమం క్రింద 12 రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు ప్రతిపాదించడం జరిగింది.
i) నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు
ii) విద్యుదీకరణ
iii) త్రాగు నీటి సరఫరా
iv) విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడు ఫర్నిచర్
v) పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం
vi) పెద్ద మరియు చిన్న మరమ్మత్తులు
vii) గ్రీన్ చాక్ బోర్డులు
viii) ప్రహారీ గోడలు
ix) కిచెన్ షెడ్లు
x) శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంలు
xi) ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్
xii) డిజిటల్ విద్య అమలు
4.‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమంలో పేర్కొన్న 12 విభాగాల అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్ రూ.7,289.54 కోట్లు అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలలకు (35%) అంచనా బడ్జెట్ రూ.3,497.62 కోట్లుగా ఉంది.
5. ఎంపిక చేయబడిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ‘ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. అలాగే అమలు చేసే ఏజెన్సీ విభాగాల వారీగా సాంకేతిక అనుమతిని ఇస్తుంది.
6. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పటిష్టత :
‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా మరియు అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం ‘పాఠశాల నిర్వహణ కమిటీ’ (ఎస్.ఎమ్.సి.)లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది.
7. ‘‘మన ఊరు – మన బడి’’ కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను రాష్ట్ర ఐటి డిపార్ట్ మెంట్ పర్యవేక్షిస్తుంది.
8. ‘పాఠశాల నిర్వహణ కమిటీ’లకు దశల వారీగా పారదర్శక పద్ధతిలో నిధులను విడుదల చేస్తారు.
9. సామాజిక తనిఖీ : గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తున్న ‘‘సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్సపరెన్సీ’’ (ఎస్.ఎ.ఎ.టి.) అనే సంస్థ చేత సామాజిక తనిఖీ నిర్వహిస్తారు.
10. పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు : ప్రతి స్కూల్ లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి..ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచ్, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దాతలు, సిఎస్ఆర్ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.
11. ఆర్థికాంశాలు మరియు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్ధిష్ట కాలపరిమితితో కూడిన అంశాలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి.
రాష్ట్రంలో ఫారెస్ట్ యూనివర్సిటీ…
సిద్ధిపేట జిల్లా ములుగులోని ‘ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (ఎఫ్.సి.ఆర్.ఐ) లో బి.ఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ను
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్.సి.ఆర్.ఐ. లో విద్యనభ్యసించిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్’ (ఎ.సి.ఎఫ్.) విభాగంలోని ఉద్యోగాల్లో 25 % రిజర్వేషన్లు, ‘ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్’ (ఎఫ్.ఆర్.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు, ‘‘ఫారెస్టర్స్’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్ (1997) మరియు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది.
తెలంగాణలో ‘ఫారెస్ట్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అటవీశాఖ అధికారులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినెట్ కు అందించగా, వచ్చే కేబినెట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని రావాలని అటవీశాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఇరిగేషన్ శాఖపై…
ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. పలు అంశాలను ఆమోదించింది.
– సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తపాస్ పల్లి జలాశయం కింద సిద్దిపేట జిల్లాలో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
– వనపర్తి జిల్లాలో గోపాల్ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న పెద్దచెరువు పునరుద్దరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
– మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఘన్ పూర్ బ్రాంచి కాలువ పనులకు 144.43 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్ పూర్ మరియు అడ్డాకుల మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
– ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా – కోరాటా బ్యారేజికి సంబంధించి రూ.795.94 కోట్లకు అంచనా వ్యయాన్ని సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఇప్పటికే బ్యారేజి నిర్మాణం పూర్తి అయ్యింది, పంప్ హౌజ్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో భీమ్ పూర్, జైనథ్, భేలా, ఆదిలాబాద్ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.
– మెదక్ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్ పూర్ ఆనకట్ట కాలువల వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలిపోయిన మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది.
-వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోధించింది.
– వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల సముద్రం చెరువు పునరుద్ధరణ మరియు సుందరీకరణ పనుల కోసం రూ.10.01 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
– గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి సవరించిన అంచనా వ్యయం రూ.669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
– సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, పాల్కేడ్ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్ పహాడ్ బ్రాంచ్ కెనాల్ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ.16.23 కోట్లకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
– సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల సేకరణకై కంపెనీస్ యాక్ట్ (COMPANIES ACT), 2013 ప్రకారం మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోధించింది. ఈ కార్పొరేషన్ కు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈఎన్‌సీ (జనరల్), ఈఎన్‌సీ (గజ్వెల్), ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ, ఇరిగేషన్ శాఖ జాయింట్ సెక్రెటరీ, సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.
– దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు పంప్ హౌజ్, కాలువ పనులకు; గుండ్ల సాగర్ నుంచి లౌక్య తండా వరకు పైప్ లైన్ పనులకు; నశ్కల్ జలాశయం వద్ద పంప్ హౌజ్ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

About The Author