తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించాలి – మంత్రి శ్రీ కేటీఆర్


తెలంగాణ రాష్ట్రం తలపెట్టిన పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.

వరంగల్ మెట్రో- నియో ప్రాజెక్టు:

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక వరంగల్ మెట్రో- నియో ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ ప్రాజెక్ట్ DPR (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు ఇది వరకే సమర్పించడం జరిగింది అని ఆయన తన లేఖలో తెలియజేశారు.

ద్వితీయ శ్రేణి నగర ప్రజా రవాణాలో ఒక మైలురాయిగా వరంగల్ మెట్రో- నియో ప్రాజెక్టు నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ వ్యయంలో 20% (184 కోట్లు) మంజూరు చేయాలని ఆయన కోరారు

మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్ (MRTS):

హైదరాబాద్ నగరం పశ్చిమాన ఉన్న కోకాపెట్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ” సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్’ (CBS) గా మారుతున్నది. వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు CBS ప్రాంతంలో పనిచేయబోతున్నారు. నగరం నలుమూలల నుండి ఈ ప్రాంతానికి పటిష్టమైన ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకతను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని కేటీఆర్ తన లేఖలో వివరించారు.

దీనికోసం కేపీహెచ్‌బీ – కోకాపేట – నార్సింగి కారిడార్‌ లో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్ (MRTS) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఈ MRTS ప్రాథమిక నిర్మాణ అంచనా వ్యయం రూ. 3050 కోట్లు కాగా, ప్రాజెక్టు వ్యయంలో 15% అంటే రూ.450 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.

సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ (CSMP):

హైదరాబాద్‌లో పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ నిర్మించాల్సిన ఆవశ్యకతను మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ (CSMP) గురించి ఆయన లేఖలో వివరించారు.

ఈ మాస్టర్ ప్లాన్‌లో 62 మురుగునీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (STP) నిర్మాణం, మురుగునీటి మెయిన్‌ల నిర్మాణం, మురుగునీటిని సేకరించడానికి మరియు STPల వరకు చేరవేసేందుకు మెయిన్‌ల నిర్మాణం భాగంగా ఉన్నాయి అన్న వివరాలు మంత్రి లేఖ ద్వారా తెలియజేశారు.

పలు దశల్లో జరగునున్న ఈ ఎస్టీపీ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.8684.54 కోట్లు అవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయంలో మూడింట ఒక వంతు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన కోరారు. మిగతా ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఆయన తెలియజేశారు.

లింక్ రోడ్ల నిర్మాణం:

హైదరాబాద్ నగరంతో పాటు హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ (హెచ్‌యుఎ)లో రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం, మోడల్ కారిడార్ల అభివృద్ధి & హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ వివరించారు.

మొత్తం 22 మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టి పూర్తి చేసినట్లు, మరో 17 లింక్ రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి అని మంత్రి కేటీఆర్ తెలియ చేశారు. ఇంకా, మిస్సింగ్ లింక్ కనెక్టివిటి మరింత మెరుగుపరచడానికి, అభివృద్ధిని చుట్టుపక్కల ఉన్న ULBలతో సహా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడానికి, గుర్తించిన 104 అదనపు కారిడార్‌లను రూ. 2400.00 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ లింక్ రోడ్లు, కనెక్టింగ్ కారిడార్ లు నగర జీవనాన్ని ఎంతో సౌకర్యవంతంగా మారుస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నిమిత్తం మొత్తం అంచనా వ్యయం రూ 2400.00 కోట్లలో మూడింట ఒక వంతు అంటే రూ. 800 కోట్లు కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP):

దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా రోడ్ నెట్‌వర్క్ నిర్మాణం జరగాలన్న గౌరవ ప్రధాన మంత్రి ఆశయం మేరకు తెలంగాణ లో ఎస్‌ఆర్‌డిపి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది అని కేటీఆర్ పేర్కొన్నారు. సమగ్ర రవాణా అధ్యయనం (CTS) ఆధారంగా SRDP లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరిస్తూ అయా ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.

హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా SRDP ద్వారా పలు ప్రణాళికలు రూపొందించింది అని ఆయన తెలియజేశారు. పలు స్కైవాక్‌లు (100 కిమీ), ప్రధాన కారిడార్లు(166 కిమీ), ప్రధాన రహదారులు (348 కిమీ), అధిక ప్రాధాన్యత గల రహదారుల నిర్మాణం (సుమారు 1400 కి.మీ., గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లైఓవర్లు, మూసీ నది వెంబడి తూర్పు – పశ్చిమ కనెక్టివిటీ, మూసీ నది వెంబడి కనెక్టివిటీని అందజేసేటటువంటి స్కైవేలు (మూసీ నదిపై స్థూపాన్ని పెంచడం ద్వారా) మరియు మూసీకి ఇరువైపులా 16 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ అంచనా వ్యయం రూ 11,500 కోట్లు అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో రెండు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఆయన లేఖలో కోరారు. అవి.
1. రాజీవ్ రహదారి-SH 01 (RR-14)లో ప్యారడైజ్ జంక్షన్ (జింఖానా గ్రౌండ్స్ వద్ద) నుండి షామీర్‌పేట్ గ్రామం సమీపంలోని ORR జంక్షన్ వరకు ఆరు లేన్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్

2. ప్యారడైజ్ జంక్షన్ నుండి కండ్లకోయ (v) సమీపంలోని ORR జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.

ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించిన భూమికి సంబంధించిన విషయం రక్షణ మంత్రిత్వ శాఖతో పరిశీలనలో ఉందని, భూసేకరణ ఖర్చు మినహా మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.9000 కోట్లు అని మంత్రి కేటీఆర్ తెలియచేశారు.

అలాగే, SRDP రెండవ దశ కోసం DPRలు రూ. 14,000 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొన్నాయి అని, ముఖ్యమైన రహదారులను మెరుగుపరచడం, సజావుగా అనుసంధానం కోసం ఫ్లై ఓవర్లు మరియు అండర్‌పాస్‌ల నిర్మాణం మరియు ముఖ్యమైన రోడ్ల విస్తరణ వంటివి ఇందులో ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు.

ఈ SRDP ప్రాజెక్టులను త్వరిత గతిలో పూర్తి చేయడానికి, మొత్తం అంచనా వ్యయంలో 10% అంటే సుమారు రూ 3,450 కోట్ల కేంద్రం మంజూరు చేయాలని ఆయన దేశ ఆర్థికమంత్రిని కోరారు.

About The Author