అడ్డంగా బుక్కైన లలితా జువెల్లరీ అధినేత..!


‘డబ్బులు ఊరికే రావు…
అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు.

డబ్బులు ఊరికే రావు…’ అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత నొక్కేయాలనుకున్నారు. కానీ అధికారులకు చిక్కిపోయారు. ‘పక్క షాపులోనో వెరిఫై చేసుకోండి..’ అంటూ కస్టమర్లకు సూచనలిచ్చే ఆయన.. జీఎస్టీ రిటర్న్స్‌లో మాత్రం తప్పుడు లెక్కలు ఇచ్చారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (జీఎస్టీఆర్-9) పేరుతో రూ. 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పింటిన రిటర్న్స్ లెక్కల ప్రకారం రూ. 41.22 కోట్లే రావాల్సి ఉన్నది. వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ. 15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు తేలింది. ఈ తప్పుడు లెక్కలను వెరిఫై చేసిన స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.

ఇదే విషయాన్ని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కూడా ఆడిటింగ్ సందర్భంగా దీన్ని పసిగట్టింది. జీఎస్టీ విభాగం అధికారులను నిలదీసింది. లలిత జువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. వాటిని అందుకున్న తర్వాత విశ్లేషించి అధికారులను వివరణ కోరింది. చివరకు 2022 జూలైన అధికారుల నుంచి కాగ్‌కు రిప్లై వెళ్ళింది. రిటర్న్స్ లో తప్పుడు లెక్కలు చూపించినట్లు గుర్తించామని, డీఆర్‌సీ-1 ప్రకారం లలిత జువెల్లరీకి నోటీసులు ఇచ్చామని, అదనంగా పొందిన రూ. 15.39 కోట్లలో రూ. 14.85 కోట్ల మేర రివర్సల్ (తిరిగి వచ్చింది) అయిందని కాగ్‌కు పంపిన రిప్లైలో ఆఫీసర్లు పేర్కొన్నారు. కానీ మిగిలిపోయిన రూ. 53.52 లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని తన నివేదిక (2022-23)లో కాగ్ పేర్కొన్నది.

ఆడిటింగ్ ప్రాసెస్ పూర్తయ్యే నాటికి (గతేడాది ఏప్రిల్ చివరి వరకూ) జీఎస్టీ అధికారుల నుంచి వివరణ అందలేదని కాగ్ ఆ నివేదికలో వివరించింది. రాష్ట్రంలో రాండమ్‌గా టాప్-50 (ఎక్కువ జీఎస్టీ రిటర్న్స్ సమర్పిస్తున్న) కంపెనీల వివరాలను ఆడిటింగ్ చేసినప్పుడు లలిత జువెల్లరీ (పంజాగుట్ట బ్రాంచ్) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ కంపెనీ నుంచి ఇంకా రావాల్సిన రూ.53.52 లక్షలకు సంబంధించి అధికారులు వసూలు చేశారో లేదో వచ్చే సంవత్సరం అసెంబ్లీకి సమర్పించే ఆడిట్ రిపోర్టులో వెల్లడి కానున్నది. డబ్బులు ఊరికే రావు… అంటూ ప్రజలకు జాగ్రత్తలు చెప్పే లలిత జువెల్లరీ మాత్రం ప్రభుత్వం నుంచి తప్పుడు లెక్కలు సమర్పించి ఏకంగా రూ. 15.39 కోట్లను పొందడం గమనార్హం.

About The Author