సెమీకండక్టర్ విప్లవం – ప్రపంచాన్ని మార్చిన తెలుగు తేజం దశరథ రామ్ గుడె


సెమీకండక్టర్ అనే పదం వింటే చాలామంది అమెరికా, తైవాన్ లేదా కొరియా గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ ఈ రంగంలో ఒక విప్లవాత్మక మలుపు తిప్పిన వ్యక్తి మన గుంటూరు జిల్లా మాచవరం గ్రామానికి చెందిన దశరథ రామ్ గుడె గారు. ప్రపంచ ప్రఖ్యాత AMD (Advanced Micro Devices) సంస్థలో ఆయన చేసిన పరిశోధనలు నేటి టెక్ ప్రపంచానికి బాటలు వేశాయి. ముఖ్యంగా CPU + GPU కలయికతో రూపొందించిన Fusion Chip లేదా APU (Accelerated Processing Unit) ఆయన ప్రతిభకు నిదర్శనం.

గుంటూరు జిల్లా మాచవరం గ్రామంలో జన్మించిన దశరథ రామ్ గారు చిన్ననాటి నుంచే విజ్ఞాన పిపాస కలిగినవారు. కాకినాడలో విద్యనభ్యసించి, ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత, అమెరికాకు వెళ్లి కంప్యూటర్ చిప్ డిజైన్ రంగంలో తనదైన ముద్ర వేశారు.

AMD India యొక్క MDగా, ఆయన 50 ఇంజనీర్‌లతో ప్రారంభించి 1,100 ఇంజనీర్‌ల టీమ్‌ను నిర్మించారు. Fusion SoC రూపకల్పన నుంచి, audio technology centre స్థాపన వరకు AMDకి ప్రపంచ స్థాయి గౌరవం తెచ్చారు. అక్కడ పనిచేసే సమయంలో దశరథ రామ్ గారు CPU (Central Processing Unit) మరియు GPU (Graphics Processing Unit) లను ఒకే చిప్‌లో ఏకీకరించే విప్లవాత్మక ఆలోచనను ముందుకు తెచ్చారు. ఇది కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాదు – కంప్యూటింగ్ ఖర్చు తగ్గింది, పనితీరు పెరిగింది, శక్తి వినియోగం తగ్గింది. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా AMD కంపెనీకి గణనీయమైన మార్కెట్ ఆధిపత్యం తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచ కంప్యూటర్ హార్డ్‌వేర్ రంగంలో AMD ఒక అగ్రగామి సంస్థ.

21వ శతాబ్దపు టెక్నాలజీకి వెన్నెముక సెమీకండక్టర్ చిప్స్. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఉపగ్రహాలు, ఆటోమొబైల్స్, రక్షణ పరికరాలు – అన్నింటికీ చిప్స్ అవసరం. ప్రపంచాన్ని నడిపించే ఈ విప్లవంలో దశరథ రామ్ గారు చేసిన ఫ్యూజన్ చిప్ డిజైన్ ఒక కొత్త దిశను చూపించింది.

హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సాధ్యమైంది. గేమింగ్, గ్రాఫిక్స్, AI రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీ పెరిగింది. తక్కువ ధరలో అధునాతన కంప్యూటింగ్ అందుబాటులోకి వచ్చింది.

అమెరికాలో విజయాలు సాధించిన తర్వాత దశరథ రామ్ గారు భారత్‌కు తిరిగి వచ్చి Veda IIT (వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం – భారత యువతను సెమీకండక్టర్, VLSI డిజైన్, ఎలక్ట్రానిక్స్, AI వంటి రంగాల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడం. (వీరి గురించి పూర్తి వ్యాసం MegaMindsIndia వెబ్‌సైట్ లో లభిస్తుంది)

వేదా IIT నుండి వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే Intel, AMD, Qualcomm, TSMC, Micron వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. దీని వల్ల హైదరాబాద్ నేడు సెమీకండక్టర్ హబ్ గా పేరుగాంచింది.

మొబైల్ చిప్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్, 5G, AI, Quantum Computing – ఇవన్నింటిలో భారతీయ యువతకు అపార అవకాశాలు ఉన్నాయి. ఆయన దృష్టిలో, భారతదేశం కేవలం సాఫ్ట్‌వేర్ సర్వీసుల దేశంగా మిగిలిపోకూడదు. హార్డ్‌వేర్ – ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీలో కూడా భారత్ ప్రపంచానికి ముందుండాలని ఆయన నమ్మకం. అందుకే ఆయన విద్యార్థులకు శిక్షణ, స్టార్ట్‌అప్స్‌కి మెంటార్‌షిప్, టెక్ ఎకోసిస్టం అభివృద్ధిపై దృష్టి పెట్టారు.

ప్రపంచంలో నేడు సెమీకండక్టర్ ఆధిపత్యం తైవాన్, అమెరికా, కొరియా, చైనా చేతుల్లో ఉంది. కానీ దశరథ రామ్ గారు, ఆయనలాంటి టెక్ లీడర్స్ ని తయారు చేయడం వల్ల భారత్ దూసుకుపోతోంది. రాబోయే దశాబ్దం లో భారత్ – ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – ప్రపంచ సెమీకండక్టర్ హబ్ అగ్రస్థానంలో నిలవడం ఖాయం.

ప్రస్తుతం దశరథ రామ్ గారు నిర్వహిస్తున్న బాధ్యతలు:
INVECAS CEO
Veda IIT Chairman & Promoter
Makuta VFX Advisor
సెమీకండక్టర్ విప్లవం, VLSI నైపుణ్యం, విద్యా సామర్థ్యానికి వారు చేస్తున్న సేవలు భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దగలదు.

About The Author