వేడిగాలులు.. వడదెబ్బ ముప్పు…


ఈ సమ్మర్ సలసలే.. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈ మార్చి నెల మొదటి వారం నుంచే సూర్యుడు చుర్రుమనిపిస్తున్నాడు. ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రం కానున్నాయి. ఉదయం 10గంటలకే ప్రతాపం చూపుతున్న సూరీడు మధ్యాహ్నం సమయంలో చెమటలు కక్కిస్తున్నాడు. వేడి ఉక్కపోత పెరుగుతాయి. అందుకే అడుగు బయట పెట్టాలంటనే జనం భయపడుతున్నారు. దేశంలో గడిచిన కొన్నేళ్లు గా ఎండలు దంచి కొడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పారిశ్రామికీకరణ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అడవులు నరికివేత, కొండలు తొలచివేత, భూమిలో కలవని వ్యర్థాలతో భూ ఉపరితలం నిండిపోవడం, కాలుష్యం, ప్లాస్టిల్ వినియోగం మొదలైన కారణాలతో వస్తున్న వాతావరణంలోని మార్పులు విపత్తులకు కారణభూతాలవుతున్నాయి.

ఎండాకాలం వచ్చిందంటే బైటికెళ్లి ఏ పని చేసుకోవాలన్నా కష్టమే. అతిచెమట కాకుండా వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది. సూర్యకిరణాల వేడిని భరించలేక శరీరంలో ఏర్పడే ఇంబాలెన్స్ వల్ల వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. దీన్నే ‘వడదెబ్బ’ అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులే ఎక్కువగా వడదెబ్బకు గురవు తుంటారు. వీరేకాక దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు, దుర్బలురు, శుష్కించిపోయిన వారిలోను, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణకోశ, మూత్రకోశాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఎండలో పనిచేసేవారు, స్థూల కాయులు, వాతావరణంలోని మార్పులకి తట్టుకోలేనివారు, శరీరంలో నీటిశాతం తగ్గిన వారు, అధిక శారీరక, మానసిక శ్రమచేసేవారు ప్రత్యక్షం గానో, పరోక్షంగానో వేసవి తాపానికి గురి అవుతారు.
వడదెబ్బ కేసుల్లో పదింట ఒక్కరు మరణించడం జరుగుతున్న కారణంగా ఇది అంత తేలికగా తీసివేయవలసిన సమస్య కూడా కాదు.

వడదెబ్బ వల్ల మెదడులో కంజేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల బలహీనత, తలనొప్పి, తలతిప్పుట, నోట్లో నీరు ఊరడం, వాంతులు, శరీరం తూలినట్లుండడం, మైకం రావడం, మెంటల్ కన్ఫ్యూజన్, అస్థిమితం, అమిత దాహం, కండరాలలో క్రాంప్స్, అధిక చెమటలు, మెదడులోని సెరిబ్రో స్పైనల్ ద్రవంలో ప్రెషర్ పెరగడం వల్ల నాడీ మండలం దెబ్బతిని రోగి స్పృహ కోల్పోతాడు. ఒక్కోసారి రక్తస్రావం, లివర్, హెపాటిక్ ఫెయిల్యూర్, షాక్ వల్ల మరణం కూడా సంభవిస్తుంది. జీర్ణక్రియ లోపాల వల్ల కడుపుబ్బరం, విరేచనాలు, అపానవాయువు లెక్కువగా పోవడం, వాంతులు కావడం, పోషకాహార లోపం, డీహైడ్రేషన్ వంటి లక్షణాలేర్పడతాయి.

వడదెబ్బ – ముఖ్య లక్షణాలు
• శరీర ఉష్ణోగ్రత: జ్వరం 104-106 డిగ్రీల ఫారన్హీట్ వరకుంటుంది.
• నాడి వ్యవస్థ: నాడి వేగంగా (నిమిషానికి 150-160 సార్లు) కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. నిమిషానికి 20-40 సార్లు ఉచ్ఛ్వాస, నిశ్వాస లుంటాయి. రోగి ఆందోళనగా, నిర్లిప్తంగా, నీరసంగా ఉంటాడు.
• మానసిక స్థితి: తలతిరగడం, వాంతులు, మగత, ఫిట్స్ లేదా స్పృహ కోల్పోవడం.
• ఇతర లక్షణాలు: చెమట పట్టకపోవడం, విపరీతమైన దాహం, కండరాల నొప్పులు (Cramps).

వడదెబ్బ రకాలు
1. క్లాసిక్ వడదెబ్బ (Non-exertional): గాలి ఆడనీ ఇరుకు గదుల్లో ఉండటం వల్ల పిల్లలు, వృద్ధులకు వస్తుంది. ఇది ఆల్కహాలిక్స్, మెడిసిన్స్ వాడేవారిలో వస్తుంది.
2. ఎగ్జర్షనల్ వడదెబ్బ (Exertional): ఎండలో శారీరక శ్రమ చేసే అథ్లెట్లు, కూలీలు, మిలిటరీ వ్యక్తులకు వస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు & చికిత్స:
• తక్షణ సాయం: బాధితుడిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి చేర్చాలి. దుస్తులను వదులు చేసి, శరీరంపై చల్లటి నీరు చిలకరించాలి. చికిత్స ప్రారంభించే ముందు వడదెబ్బ తగిలిన వ్యక్తి వయసు, ఎండ తీవ్రత, రోగి ఆరోగ్య పరిస్థితి, వ్యాధి లక్షణాల్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది
• పానీయాలు: కొబ్బరి నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్ నీళ్లు తరచుగా తీసుకోవాలి.
• విశ్రాంతి: ఎండలో బయట తిరిగి వచ్చిన వెంటనే నీళ్లు తాగకుండా, 10-15 నిమిషాల విశ్రాంతి తర్వాతే తీసుకోవాలి.
• ఆహారం: తాటి ముంజలు, గంజి వంటి చలవ చేసే పదార్థాలు మరియు పోషకాహారం తీసుకోవాలి.

1. వేసవిలో తీసుకోవాల్సిన పోషకాహారం (Dietary Tips)
ఎండకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం.
• నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు: పుచ్చకాయ, కర్బూజ, నారింజ, మరియు ద్రాక్ష వంటివి శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి.
• పెరుగు & మజ్జిగ: ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
• ఉల్లిపాయలు: పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల వడదెబ్బ తగలకుండా రక్షణ లభిస్తుంది.
• సబ్జా గింజలు: నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది.

2. వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స (First Aid Steps)
ఒకవేళ ఎవరైనా వడదెబ్బ వల్ల స్పృహ కోల్పోతే ఈ క్రమాన్ని పాటించండి:
• చల్లబరచడం: బాధితుడి చంకలు, మెడ మరియు గజ్జల భాగంలో ఐస్ ప్యాక్‌లు లేదా తడి గుడ్డలు ఉంచాలి. ఇక్కడ రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉండటం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది.
• గాలి: ఫ్యాన్ లేదా కూలర్ కింద ఉంచి గాలి తగిలేలా చూడాలి.
• ద్రవాలు: స్పృహలో ఉంటేనే ఓఆర్ఎస్ (ORS) లేదా మజ్జిగ తాగించాలి. స్పృహ లేకపోతే నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు.

3. ఇతర జీవనశైలి జాగ్రత్తలు
• దుస్తులు: లేత రంగులో ఉండే కాటన్ (నూలు) దుస్తులు ధరించాలి. ఇవి గాలిని లోపలికి పంపి, చెమటను త్వరగా పీల్చుకుంటాయి.
• సమయం: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
• రక్షణ: బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా తలకు రుమాలు చుట్టుకోవడం మర్చిపోవద్దు.
• జాగ్రత్త: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్ ఇవ్వడం చేయాలి. యాంటి షాక్ ట్రీట్మెంట్, ఎలక్ట్రోలైట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 95శాతం మందికి విశ్రాంతి ఇచ్చిన 4-5 రోజులకి కోలుకుంటారు. సరైన నిద్ర లేనివారు, ఉపవాసాలున్నవారు, మద్యం సేవించేవారు, జ్వరం ఉన్నవారు, జీర్ణాశయ వ్యాధులతో బాధపడేవారు, జబ్బుపడి కోలుకుంటున్న వారు, సోరియాసిస్, ఎగ్జిమాతో బాధపడేవారు బైట తిరగకుండా జాగ్రత్తపడాలి.

ముందస్తు హెచ్చరికలు (Warning Signs)
మీకు విపరీతమైన తలనొప్పి వస్తున్నా, చెమట పట్టడం ఆగిపోయినా లేదా కండరాలు పట్టేస్తున్నా (Cramps) వెంటనే నీడలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి. ఇది వడదెబ్బకు ప్రాథమిక సంకేతం.

ముఖ్య గమనిక:
వడదెబ్బ అనేది కేవలం ఎండలో తిరిగే వారికే కాదు, గాలి ఆడని గదుల్లో ఉండేవారికి కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా ఊపిరితిత్తులు, గుండె జబ్బులు ఉన్నవారు, స్థూలకాయులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

అందుకే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.

డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు,
మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,
మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం.

About The Author