హీరో మోటోకార్ప్ CSR ద్వారా తిరుపతి జిల్లా పోలీసు శాఖకు 66 VIDA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అందజేత

తిరుపతి, జూలై 15: రాష్ట్రంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసుల అత్యవసర స్పందన సామర్థ్యాన్ని పెంపొందించడం, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, అలాగే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం అనే గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి అనుగుణంగా, హీరో మోటోకార్ప్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా 66 VIDA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తిరుపతి జిల్లా పోలీసు శాఖకు అందజేసారు.

ఈ వాహనాలను ఈ నెల 01-07-2026న శ్రీ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,గారు స్వీకరించారు. అనంతరం నేడు తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., హీరో మోటోకార్ప్ ప్రతినిధులతో కలిసి ఈ వాహనాలను మహిళా పోలీసు సిబ్బందికి అందజేశారు.

పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., అధ్యక్షత వహించారు.

 

కార్యక్రమం ప్రారంభంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతీకాత్మకంగా మహిళా పోలీసు సిబ్బందికి హెల్మెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వైట్ టీ-షర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ ప్రతినిధులను తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఘనంగా సత్కరించగా, హీరో మోటోకార్ప్ సంస్థ కూడా జిల్లా పోలీసు అధికారులను సన్మానించింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., గారు మాట్లాడుతూ..హీరో మోటోకార్ప్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పోలీసు శాఖకు 66 VIDA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ప్రతిపాదనను సానుకూలంగా స్వీకరించి మహిళా పోలీసు సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాలను అందించిన హీరో మోటోకార్ప్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాహనాలను అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా వినియోగించి మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా ఆధునిక, సాంకేతికత ఆధారిత పోలీసింగ్‌కు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ…హీరో మోటోకార్ప్ సంస్థ CSR కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లా పోలీసు శాఖకు 66 VIDA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించినందుకు సంస్థ యాజమాన్యానికి జిల్లా పోలీసు శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వాహనాలను జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరుగుతుందని, ముఖ్యంగా శక్తి టీమ్ (Women Safety Team) వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల భద్రతకు సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు మహిళా పోలీసు సిబ్బంది పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, శక్తి యాప్, డయల్-112 సేవలు, మహిళల చట్టపరమైన హక్కులు, బాలికల రక్షణ తదితర అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

అదేవిధంగా ఆపదలో ఉన్న మహిళలకు సకాలంలో చేరుకుని తక్షణ సహాయం అందించడం, అత్యవసర ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం వంటి కార్యక్రమాల్లో ఈ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని తెలిపారు. ఈ వాహనాల ద్వారా మహిళా పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువై, మహిళల భద్రత కోసం వేగవంతమైన సేవలు అందించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.

తిరుపతి జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తిని వెంటనే సానుకూలంగా స్వీకరించి CSR కార్యక్రమం ద్వారా ఈ వాహనాలను అందించిన హీరో మోటోకార్ప్ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ శాఖలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమం, మహిళల భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్‌కు సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.

ఈ వాహనాలలో 53 వాహనాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 53 పోలీస్ స్టేషన్లకు ఒక్కోటి చొప్పున, మిగిలిన 13 వాహనాలను మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో మహిళా పోలీస్ స్టేషన్లు/మహిళా పోలీసు విభాగాలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ వాహనాలను ప్రధానంగా శక్తి టీమ్ (Women Safety Team) ద్వారా మహిళల భద్రత, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, శక్తి యాప్, డయల్-112 సేవలపై ప్రచారం, సైబర్ నేరాల నివారణ, మహిళల చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సకాలంలో చేరుకుని తక్షణ సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

చివరగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సంయుక్తంగా 66 VIDA ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్లు శ్రీ శ్రీనివాసులు (పరిపాలన), శ్రీ రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు), శ్రీమతి ఎం. శ్రీలత (మహిళా విభాగం), శ్రీమతి గీతా కుమారి (ఎస్‌బీ), జిల్లా పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, హీరో మోటోకార్ప్ తరఫున శ్రీ ప్రభు ఎస్. (Plant Head), శ్రీ మనోహర చక్రవర్తి (HR Head), లెఫ్టినెంట్ కమాండర్ కె. కిరణ్ (రిటైర్డ్) – Head, Administration & Security, హీరో మోటార్స్ షో రూమ్ ప్రతినిధి పృద్వి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author