భర్తను చంపి, కొడుకును విగతజీవిని చేసి..బెడ్పై ప్రశాంతంగా ఫోన్ స్క్రోల్ చేస్తున్న భార్య!


కర్ణాటకలోని ధార్వాడ్లో ఒక ఘోరమైన ఘటన వెలుగుచూసింది. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ కిరణ్ హొన్నావర్ (45)ను ఆయన భార్య, తోటి డాక్టర్ అయిన ప్రియాంక కట్టనహళ్లి దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనలో వారి ఎనిమిదేళ్ల కుమారుడిపై కూడా దాడి జరగ్గా, తీవ్ర గాయాలైన బాలుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

హుబ్బళ్ళి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… డాక్టర్ కిరణ్ చిరాయు ఆసుపత్రిలో అనస్థీషియాలజిస్ట్గా పనిచేస్తున్నారు.

బుధవారం సాయంత్రం బంధువులు వారి ఫ్లాటు వెళ్లేసరికి ఇల్లంతా రక్తసిక్తంగా మారి ఉంది. ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండగా, పక్కనే ఉన్న కుమారుడు గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే, నిందితురాలు ప్రియాంక మాత్రం ఏమాత్రం చలనం లేకుండా బెడ్పై పడుకుని మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపించడం అక్కడి వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కమిషనర్ శశికుమార్ వెంటనే స్పందించి, శ్వాస తీసుకుంటున్న బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం బంధువులు, పొరుగువారు ఫోన్ చేసినప్పుడు… కిరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని, విధులకు వెళ్లారని ప్రియాంక అబద్ధాలు చెప్పి నమ్మించింది.

ప్రాథమిక విచారణ ప్రకారం, ఘటన జరిగిన సమయంలో ఇంట్లో భార్యాభర్తలు, కుమారుడు తప్ప బయటి వ్యక్తులు ఎవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. అసలు ఈ ఘాతుకానికి గల కారణాలు ఏమిటి? ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి నిరూపణల కోసం సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

About The Author