నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి టీచర్ కు ఉరిశిక్ష …


నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి
టీచర్ కు ఉరిశిక్ష …

నాలుగేళ్ల చిన్నారిపై అత్యంత దారుణ అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను అటవీ ప్రాంతంలో వదిలేసిన పాఠశాల ఉపాధ్యాయునికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు మరణదండన ఖరారు చేసింది. ఈ క్రమంలో వచ్చేనెల 2న శిక్షను అమలు చేయాలని జబల్‌పుర్‌ కేంద్ర కారాగారానికి సెషన్స్‌ న్యాయస్థానం సోమవారం ఆదేశాలు పంపింది. గతేడాది జూన్‌ 30న నాలుగేళ్ల చిన్నారిని మహేంద్రసింగ్‌ గోండ్‌ అనే పాఠశాల ఉపాధ్యాయుడు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి, ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. బాలిక స్పృహ కోల్పోయి అచేతనంగా మారడంతో, చనిపోయిందని భావించి ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కుమార్తె ఎంతకూ ఇల్లు చేరలేదని తల్లిదండ్రులు వెతకగా ఎట్టకేలకు చిన్నారి జాడ కనిపించింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన తీవ్ర సంచలనం కావడంతో పోలీసులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని హెలికాప్టర్‌లో బాలికను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించింది. దారుణ అకృత్యానికి ఆమె పేగులు బాగా దెబ్బతినడంతో నెలల తరబడి ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. పలు శస్త్రచికిత్సలు చేస్తేగాని సాధారణ స్థితికి రాలేకపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన నాగోద్‌ సెషన్స్‌ కోర్టు గత సెప్టెంబరులో నిందితుడికి మరణదండన విధించింది. హైకోర్టు కూడా గతనెల 25న ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో శాంతా జిల్లా సెషన్స్‌ కోర్టు గోండ్‌కు వ్యతిరేకంగా బ్లాక్‌ వారెంట్‌ జారీచేసింది. అతడిని వచ్చేనెల 2న ఉరి తీయాలంటూ జబల్‌పుర్‌ కేంద్ర కారాగారాన్ని ఆదేశిస్తూ ఈ-మెయిల్‌ పంపింది. సుప్రీంకోర్టు లేదా రాష్ట్రపతి నుంచి నిలుపుదల ఉత్తర్వులు రాకపోతే శిక్ష యథాతథంగా అమలవుతుంది.

About The Author