జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి చెక్కుల పంపిణీ…

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 19వ తేదీన చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. గురువారం నాడు మాసబ్ ట్యాంక్ లో గల సమాచార భవన్ లో మీడియా అకాడమీ చైర్మన్ ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి 57 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, 25 మంది తీవ్ర అనారోగ్య/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టుల దరఖాస్తులకు ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. చెక్కుల పంపిణీని ఈ నెల 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్ మహమూద్ అలీ, ప్రభుత్వ సలహాదారు కే.వి. రమణా చారి, దుబ్బాక, ఆందోల్ శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి,చంటి క్రాంతి కిరణ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, మీడియా అకాడమీ పాలకమండలి సభ్యులు టంకశాల అశోక్, బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి, డెక్కన్ క్రానికల్ పొలిటికల్ ఎడిటర్ గౌరీ శంకర్, సాక్షి ఎడిటర్ వి. మురళి, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్, టి న్యూస్ సిఇఓ ఎమ్ . నారాయణరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమురవెల్లి అంజయ్య, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టుల ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 15 కోట్ల రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రభుత్వం కేటాయించినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అన్నారు. ఇప్పటివరకు 151 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఒక కోటి యాభై ఒక్క లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశామని, ఆయా కుటుంబాలకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తున్నామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్ కే జి నుండి పదవ తరగతి వరకు చదువుకున్న 104 మంది విద్యార్థులకు నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు. దీనితో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 52 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున 26 లక్షల ఆర్థిక సహాయము సంక్షేమ నిధి నుంచి అకాడమీ అందజేసింది అన్నారు. ఇప్పటి వరకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి 2 కోట్ల 75 లక్షల ఆర్థిక సహాయం జర్నలిస్టు కుటుంబాలకు అందజేసామని, ఈ నెల 19వ తేదీన మరో 70 లక్షల రూపాయలను జర్నలిస్టుల కుటుంబాలకు అందజేస్తామని అన్నారు.

About The Author