ప్రిన్సిపాల్‌ని చంపింది పదో తరగతి కుర్రాడే…


ప్రిన్సిపాల్‌ని చంపింది పదో తరగతి కుర్రాడే
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ
నల్గొండ జిల్లా పట్టణ కేంద్రంలోని జేబీ కాలనీలో వారం రోజుల క్రితం జరిగిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కల్లు రూపారెడ్డి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హంతకుడు పదో తరగతి చదువుతున్న వంశీగా గుర్తించారు. ఇతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే హత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.
మృతురాలు కల్లు రూపారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఒంటిపై కత్తిపోట్లు కనిపించాయి. హంతకుడు గ్లౌజులు ధరించి ఈ దారుణానికి పాల్పడటంతో ఘటనా స్థలంలో ఎలాంటి ఆనవాళ్లూ లభించలేదు. దీంతో కేసు ఛేదన పోలీసులకు సవాలుగా మారింది.
లభ్యమైన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా హంతకుడి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండొచ్చని పోలీసులు తొలుత అంచనా వేశారు. పాఠశాల సిబ్బంది, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులను విచారించారు. సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత శనివారం ప్రత్యేక నిఘా విభాగం (స్పెషల్‌ బ్రాంచ్‌) పోలీసులు కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటై దర్యాప్తు ముమ్మరం చేశాయి. సుమారు 80 మందిని విచారించిన అనంతరం కొండమల్లేపల్లి మండలంలోని రెండు తండాలకు చెందిన విద్యార్థులు ఈ హత్యకు పాల్పడ్డారని గుర్తించారు.
నిందితుల కోసం గాలింపు చేస్తున్న పోలీసులు ముగ్గురిపై అనుమానం రావడంతో ఇబ్రహీంపట్నం వద్ద మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. రూపారెడ్డి హత్య అనంతరం ఆ విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై పోలీసులు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు.

About The Author