లోక్ సభలో తెలుగు రాష్ట్రాల సమస్యలకు తప్పకుండా మద్దతిస్తాను:ఎంపీ నవనీత్ కౌర్…

టాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి ఆపై పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన నవనీత్ కౌర్ ఇప్పుడు ఎంపీగా గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆమె భర్త మహారాష్ట్రలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, నవనీత్ కౌర్ కూడా భర్త అడుగుజాడల్లోనే స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. నవనీత్ కౌర్ ది ప్రేమవివాహం. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ నిర్వహించిన ఓ యోగా శిబిరంలో రవి రాణాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. వీరి పెళ్లికి బాబా రాందేవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెబుతారు.

అయితే, 2014 ఎన్నికల్లో నవనీత్ కౌర్ పోటీచేయగా, ప్రత్యర్థి ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో ప్రచారం చేసి ఓటమికి కారణమయ్యారు. అయితే ఓటమికి కుంగిపోకుండా నవనీత్ పట్టుదలతో ప్రయత్నించి ఈసారి ఎన్నికల్లో విజయాన్నందుకున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ప్రజలతో ఎలా కలిసిపోవాలన్న విషయం తాను ఏపీ సీఎం జగన్ ను చూసే నేర్చుకున్నానని వెల్లడించారు.

తనకు ఏపీలో జగనే స్ఫూర్తి అని, రాజకీయంగా ఆయన్ను గమనిస్తుంటానని తెలిపారు. తన సినీ కెరీర్ విజయవంతం అయ్యిందంటే అందుకు కారణం తెలుగు ప్రజలేనని వినమ్రంగా చెప్పిన ఈ ఎంపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ప్రస్తావిస్తే తాను తప్పకుండా మద్దతిస్తామని స్పష్టం చేశారు. నవనీత్ కౌర్ ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆమె భర్త రవి రాణా బద్నేరా అసెంబ్లీ స్థానంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు.

About The Author