ఈ భూ ప్రపంచంలోనే శివుడికి రూపం ఉండి.. తలక్రిందులుగా ఉన్న ఏకైక దేవాలయం…


ఈ ప్రపంచంలో ఎక్కడైనా శివుడిని పూజించేది ఒక్క శివలింగ రూపంలోనే !.
శివలింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఒక క్షేత్రం ఉందని ఎవరికైనా తెలుసా!
అంతే కాకుండా ఆ గుడిలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు.

ఆ పుణ్యక్షేత్రం ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయం పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరంకు కేవలం 5 కి.మీ దూరంలో ఉండటం విశేషం.

*ఈ ఆలయం యొక్క విశిష్టత.*

ఈ గ్రామంలో వెలసిన శక్తీశ్వరాలయం చాలా విశిష్టమైనది. ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.
శక్తి పీఠంలో శివుడు, పార్వతిదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ముగ్గురు కలసి ఏకపీఠం మీద ఉండటం ఇక్కడి విశిష్టత.
అలాగే పార్వతి దేవి మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామినీ ఒడిలో లాలిస్తూ కొలువై ఉండటం మరో ప్రత్యేకత….

*శివుడు తలక్రిందులుగా కొలువై..ఉండటానికి..గల కారణం..*

యముడు పాలిస్తున్న రాజ్యంలో శంబురా అనే రాక్షసుడు ప్రజలను, మునులను చాలా ఇబ్బంది పెడుతుంటాడు.
ఈ ఇబ్బందులు పడలేక ప్రజలు, మునులు ఈ రాక్షసుడిని ఒక్క యముడు మాత్రమే చంపగలడు అని యముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నీ చెబుతారు.

శంబురా రాక్షసుడితో ఇంతకు ముందే యుద్ధంలో ఓడిపోయిన యముడు మరొక సారి అతనితో పోరాడే శక్తి నివ్వమని శివుడికి తపస్సు చేస్తాడు.
ఆ సమయంలో శివుడు లోకకళ్యాణం కోసం తీవ్ర తపస్సులో ఉంటాడు.
దానితో యముని తపస్సు చూసి పార్వతి దేవి ప్రత్యక్షం అవుతుంది.
యముడు జరిగిన విషయాన్ని పార్వతి దేవికి చెబుతాడు.

అప్పుడు పార్వతి యమధర్మరాజుకు ఒక ఆయుధాన్ని ఇవ్వడం తో శంబురా రాక్షసుడిని చంపుతాడు…
దానితో ఆ రాక్షసుడి నుండి ప్రజలకు విముక్తి కలుగుతుంది.
అప్పటి నుండి ఆ ప్రాంతానికి యమపురి గా పేరు వచ్చింది కాల క్రమేణా అది యనమదుర్రు గా మారిపోయింది.

శంబురా రాక్షసుడు చనిపోయినా యమపురికి భవిష్యత్తులో ఎటువంటి ఆపద రాకుండా అక్కడే ఉండాలని యముడు శివుడిని మరొక సారి ప్రార్దిస్తాడు.

అప్పటికి ఇంకా తపస్సులోనే ఉన్న శివుడు అదే రూపంలొ కుటుంబ సమేతముగా యమపురిలో వెలిసాడని ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న కథ.
ఈ గుడిలోకి వెళితే దీర్ఘకాలరోగాలు నయం అవుతాయని స్థలపురాణంలో పేర్కొన్నారు.
ఓం నమః శివాయ..!

About The Author