ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.2 వేల నోటు ఇక బంద్‌!

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు.. అయితే, ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే మాత్రం రూ.2 వేల నోటు కూడా బంద్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వస్తుండగా.. తాజాగా.. ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.2 వేల నోటును నిలిపివేసింది. అంటే.. ఇక, ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోటు రాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు సమాచారం. అంతేకాదు.. త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.. కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఇక ఎస్బీఐ ఏటీఎంల ద్వారా పొందే వీలుంటుందన్నమాట. మరోవైపు ఏటీఎంల్లో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండడంతో.. ఏటీఎంల్లో ఫ్రీ లావాదేవీల పరిమితిని పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్టు తెలుస్తోంది. 

 

About The Author