తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి సమర్పించే ప్రసాదాల గురించి సంపూర్ణ వివరణ…


* మాత్ర లేక శుద్ధోదనం –

వరి అన్నం పెరుగుతో కలిపి మూలమూర్తికి నివేదన చేసేవారు . తరవాతి కాలంలో శొంఠిని కూడా చేర్చారు.

* సంధి తిరుప్పోవకం –

ప్రతి సంధికాలంలో సమర్పించే నివేదనలో రాజనాల లేదా సాంబా బియ్యం , పెసరపప్పు , నెయ్యి , మిరియాలు , ఉప్పు , పెరుగు , కాయగూరలు .

* తిరుక్కానమాడై –

అతి తక్కువుగా తయారుచేయబడి ఆలయానికే పరిమితమయ్యే నివేదన . దీనినే “అక్కలి” ప్రసాదం అంటారు. బియ్యం , నెయ్యి , కొద్దిగా అల్లం , బెల్లం లేదా చక్కెర , నాలుగు రకాల పండ్లు . క్రీ .శ 1457 సంవత్సరపు శాసనంలో అల్లం , పండ్లు వదిలివేయబడ్డాయి.

* పరుప్పవియాల్ తిరుప్పానకం –

తిరుప్పానకంకు ఎక్కువుగా పెసరపప్పు , చక్కెర చేర్చి ఇలా పిలిచేవారు. రాజనాల లేదా సాంబావరి , పెసరపప్పు , మిరియాలు , ఉప్పు , చక్కెర , నేతితో వేయించిన కొబ్బరికోరు .

* దధ్యోదనము –

దీనిలో పదార్దాలు తరచుగా మార్పులు చెందుతూ వచ్చాయి . రాజనాల వరి , మిరియాలు , నెయ్యి ( పోపు పెట్టేందుకు ) , గడ్డపెరుగు , శొంఠి పొడి , యాలుకల పొడి , కొద్దిగా బెల్లం , కొబ్బరి , కాయగూరలు అయితే క్రీ .శ 1517 వ సంవత్సరం శాసనంలో ఆవాలు , పసుపుపొడి , నిమ్మకాయలు , కొరముక్కలు చేర్చబడ్డాయి.

* పొంగల్ –

17 వ శతాబ్దపు శాసనాలలో పొంగల్ , పంచదార పొంగల్ పేర్లు మాత్రమే ఉన్నాయి.

* పాయసం –

బియ్యం , పాలు , నెయ్యి , చక్కెర . దీనినే మనం క్షీరన్నం అంటాము .

* చిత్రాన్నం –

ఇది 5 రకాలుగా ఉండును. వస్తువివరాలు సరిగ్గా లేవు . తిలాన్నముకు మాత్రం బియ్యం , నెయ్యి , చక్కెర , నువ్వులు వాడేవారు .

* పరుప్పవియల్ –

దీనిని పెసరపులగం అనవచ్చు. బియ్యం , నెయ్యి , పెసరపప్పు , చక్కర కలిపి వండుతారు.

* దోశె –

పడి బియ్యం , మినప పప్పు , పెరుగు , నెయ్యి లేదా బియ్యం , మినపపప్పు , నెయ్యి , చక్కెర ప్రస్తుతం ఈ నివేదన అమలులో ఉంది.

* గోధి –

గోధుమరవ్వ , పెసర పప్పు , యాలుకలు , చక్కెర , నెయ్యి ఇది ఇప్పటి సీరా లాంటిది.

* పాలేడుక్కులంబు –

దీనిని క్రీ .శ 1469 లో కందాడ రామానుజ అయ్యంగార్ ఏర్పాటు చేశారు . శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరు భార్యలు ఈ నివేదన వినియోగానికై రెండు బంగారు గిన్నెలు దానం చేశారు . ఆయన సేనాని రామనాయకుడు 200 ఆవులు దానం చేశాడు . పాలు గట్టిపడే వరకు కాచి నెయ్యి , పచ్చకర్పూరం , యాలుకలు కలిపేవారు .

వగపడి ప్రసాదాలు –

* అప్పం –

బియ్యం , నెయ్యి , బెల్లం , మిరియాలు .

* అతిరసం –

బియ్యం , నెయ్యి , బెల్లం , మిరియాలు .

* వడ –

మినపపప్పు , నెయ్యి , మిరియాలు , జీలకర్ర.

* సుఖియం –

బియ్యం , పెసరపప్పు , బెల్లం , నెయ్యి , కొబ్బరి.

* సీడై –

బియ్యం , నువ్వులు , నెయ్యి , బెల్లం , జీలకర్ర .

* ఇడ్డలి –

ఇవి రెండు రకాలు . మొదటిదానిలో బియ్యం , మినపపప్పు , నెయ్యి రెండోవాదానిలో చక్కర అదనంగా చేర్చుతారు.

* మనోహరప్పడి –

పెసరపప్పు , చక్కెర , మినపపప్పు ఈ పప్పులను నేతిలో వేయించి చక్కెర పాకంలో వేసి ఉండలుగా తయారుచేసేవారు . ఇటీవలి కాలంలో వాడబడుతున్న వస్తువులు బియ్యం , పెసరపప్పు , నెయ్యి , చక్కెర .

* కుమక్కుపడి –

ఇప్పటి సున్ని ఉండలు లాంటివి . రెండు వంతుల బియ్యపుపిండి , ఒక వంతు మినపపిండి కలిపి నేతితో వేయించి బెల్లపు పాకంలో కలిపి ఉండలుగా చేసేవారు .

* భేత విక్కెయ్ –

దీనిని పణ్యారంగా అత్తవావై బసవరాజు ఏర్పాటు చేశారు . మినపపప్పు , గోధుమ , నెయ్యి , జీలకర్ర , బియ్యం చేర్చి ఒకరకం . ఉప్పు , చక్కెర చేరని మరొకరకము ఉండేవి . ఈ రెండోరకం ప్రసాదం ప్రస్తుతం లేదు .

* జున్నుపడి –

ఇది మూరు రాజ రామరాజ శ్రీపతి ఓబులేశ్వరుల చేత క్రీ.శ 1546 లో ఏర్పాటు చేయబడినది. పాలు , ఖండశర్కర , పచ్చకర్పూరం కలిపి చేస్తారు .

* ఖండశర్కర –

ఇది కూడా జున్నులాంటిదే . క్రీ.శ 1537 లో తాళ్ళపాక తిరుమలయ్యంగారు ఏర్పాటుచేశారు .

* కాశిక్కాయి –

గోధుమరవ్వ , నువ్వులు , చక్కెర , నెయ్యి . గోధుమరవ్వ , నువ్వులు విడివిడిగా నేతిలో వేయించి గోధుమరవ్వను పిండిగా చేసి , నువ్వులతో చక్కెర పాకంలో పోసి ఉండలుగా చేసేవారు .

* తేన్ తొల –

ఇది 16 వ శతాబ్దంలో ప్రారంభం అయినది. బియ్యం , మినపపప్పు , నెయ్యి , మిరియాలు , ఉప్పు కలిపి చేస్తారు .

* సంబార ఎల్ పాడి –

పాలు , మిరియాలు , నువ్వుపొడి , జీలకర్ర కలిపి చేస్తారు .

* ఎల్లుండై –

నువ్వులు , మిరియాలు , శొంఠి , బెల్లం కలిపి చేస్తారు .

* పంచామృతం –

ఇది దేవతావిగ్రహాలకు అభిషేకార్ధం వినియోగిస్తారు . పాలు , నెయ్యి , పెరుగు , తేనె , చక్కెర సముదాయం . అభిషేకం తరువాత భక్తులకు పంచిపెట్టేవారు . వైష్ణవాలయాలలో అరుదైన దీనిని క్రీ.శ 1551 సంవత్సరంలో సూరప్పనాయకర్ ఐదురోజుల సహస్రనామార్చన ఉత్సవం సందర్భముగా స్వామివారి తిరుమంజనం (అభిషేకం ) కోసం ఏర్పాటు చేశారు . క్రీ.శ 1544 వ సంవత్సరంలో నారాయణశెట్టి ఏర్పాటు చేసిన పంచామృతంలో చక్కెర బదులు వెన్న చేరింది.

* నవనీతం –

వెన్న , తేనె , నెయ్యి , చక్కెర కలిపి చేస్తారు .

ఈ నివేదనలను భాగాలుగా చేసి పంచసంధి కాలాల్లో స్వామివారికి నివేదన చేసేవారు .

ఇప్పటి ప్రచారంలో ఉన్నవానిలో ముఖ్యమైనది తిరుప్పావడ , బియ్యం , పెసరపప్పు , నెయ్యి , నువ్వులనూనె , చింతపండు , ఆవాలు , జీలకర్ర ఉపయోగించి చేస్తారు .

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి ఒకపెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా జిలేబి , తేనెతోల , సుఖియం , చక్కెరపొంగళి , సీరా , పులిహోర , దధ్యోదనం , మిరియపు పొంగలి వంటివి లడ్డు , అప్పం , వడ , దోశె లాంటి ప్రసాదాలు వాడుకలో ఉన్నాయి .

శ్రీవారికి ప్రసాదంగా ఈనాడు ఎంతగానో ప్రశస్తికి కారణమవుతున్న లడ్డుకు తిరుమలపై ప్రాచీనకాలపు ప్రసాదాలలో ఎక్కడా చోటు కనిపించదు. శాసనాలలో లభ్యం అగుతున్న ఆధారాలను బట్టి చూస్తుంటే లడ్డు ప్రసాదం 100 నుంచి 120 సంవత్సరాల క్రితం ఏర్పరిచినట్లు అర్థం అవుతుంది.

శ్రీవారి ప్రసాదాల గురించి వివరణ సంపూర్ణం. తరవాతి పోస్టులో మరొక్క మంచి విషయం గురించి వివరిస్తాను.

గమనిక –

నాచే రచించబడిన “ఆయుర్వేద మూలికా రహస్యాలు ” , ” ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు ” అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

About The Author