లాక్‌డౌన్‌ పొడిగించాలి: ప్రధానిని కోరిన రాష్ట్రాలు


న్యూదిల్లీ: కరోనా కట్టడి, లాక్‌డౌన్‌పై భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాల్సిన తీరు, ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి సమతుల వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రులు అందించే సూచనల ఆధారంగానే దేశం ఏ దిశలో వెళ్లాలో తాము నిర్ణయించగలుగుతామని అన్నారు. కరోనా మహ్మమారి నుంచి భారత్‌ తనను తాను విజయవంతంగా రక్షించుకుందని యావత్‌ ప్రపంచం భావిస్తోందన్న ప్రధాని.. ఈ అంశంలో రాష్ట్రాలే కీలక పాత్ర పోషించాయని కొనియాడారు.

ఎక్కడైతే భౌతిక దూరం నియమాలు పాటించలేదో… ఆయా చోట్ల మనకు సమస్యలు పెరిగాయని ప్రధాని అన్నారు. లాక్‌డౌన్‌ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో మినహాయింపులిచ్చినా కరోనా అక్కడ వ్యాపించకుండా చూడటం మన ముందున్న అతిపెద్ద సవాలని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఆరు గంటల పాటు సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుమారు ఆరుగంటల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఏప్రిల్‌ 27న జరిగిన సమావేశంలో అనేక అంశాలను ప్రధాని ముందు ప్రస్తావించే అవకాశం లభించలేదని కొందరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి 9.30గంటల వరకూ ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సాయంత్రం ఆరు గంటల సమయంలో 30 నిమిషాల పాటు విరామం ఇచ్చారు.

లాక్‌డౌన్‌ పొడిగింపుపై సీఎంలు ఏమన్నారు!

కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్రాలను ప్రధాని నరేంద్రమోదీని కోరాయి. లాక్‌డౌన్‌ పొడిగించమని కోరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణలు ఉన్నాయని సమాచారం.

”ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించ వద్దు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదు. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదు. దానితో కలిసి బతకడం తప్పదు” -తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

”లాక్‌డౌన్‌ సడలింపులు; కంటైన్మెంట్‌ వ్యూహాలపై పూర్తిగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది. కంటైన్‌మెంట్‌ కారణంగా ఆర్థికలావాదేవీలకు ఇబ్బంది నెలకొంది. దీనిలో మార్పులు చేయాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో క్లినిక్‌లను బలోపేతం చేసుకోవాలి” -ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

”బిహార్‌లో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగిస్తాం. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బిహార్‌కు వస్తారు. అప్పుడు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది” -బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌

”మా రాష్ట్రానికి అత్యవసరంగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిస్ట్‌ అవసరం ఉంది. అదే విధంగా రాష్ట్రానికి రూ.3వేల కోట్ల విలువైన మెడికల్‌ పరికరాలు కావాలి. అదే విధంగా వలస కూలీలను తరలించేందుకు మరో రూ.2,500కోట్లు అవసరం. మే 31 వరకూ చెన్నైకు రైళ్లు, విమాన రాకపోకలు అనుమతించవద్దు” – తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి

”దేశంలో సమాఖ్య వ్యవస్థకు గౌరవం ఇవ్వండి. అమిత్‌ షా, ఇతర అధికారులు రాసిన లేఖలు బెంగాల్ ప్రభుత్వానికి అందకముందే మీడియా చేరుతున్నాయి. ఇది గర్హనీయం. బెంగాల్‌లో రాజకీయాలు చేయడం ఆపండి. కరోనాపై రాష్ట్రం పోరాడుతున్న ఈ సమయంలో కేంద్రం రాజకీయాలు చేయడం తగదు”- పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

About The Author