ప్రేమ పెళ్లిలో ట్విస్ట్‌… అర్ధ‌రాత్రి వ‌ధువు జంప్‌


తెల్లారితే పెళ్లి. వ‌ధువు, వ‌రుడు క‌ల్యాణ మండ‌పానికి చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు అంగ‌రంగ వైభ‌వంగా చేశారు. ముందురోజు రాత్రి రిసెప్ష‌న్‌లో బంధుమిత్రాదుల నుంచి వ‌ధూవ‌రులు ఆశీస్సులు అందుకున్నారు. ఆ త‌ర్వాత ఎవ‌రెవ‌రి గ‌దుల్లోకి వారు వెళ్లారు. ముహూర్త‌పు స‌మ‌యం కోసం ఎదురు చూపులు.

అర్ధ‌రాత్రి వేళ క‌ల్యాణ‌మండ‌పంలో క‌ల‌క‌లం. వ‌ధువు త‌ల్లితండ్రుల్లో ఏదో తెలియ‌ని ఆందోళ‌న‌. ఇంత‌కూ అక్క‌డ ఏమైంది? వ‌ధువు త‌ల్లితండ్రుల్లో ఎందుకంత ఆందోళ‌న …ఈ విష‌యాలు తెలుసుకోడానికి ఒక‌సారి త‌మిళ‌నాడు వెళ్దాం.

చెన్నైలోని నుంగంబాక్కంకు చెందిన 23 ఏళ్ల యువ‌తి ఓ ప్రైవేట్ ఉద్యోగి. త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న నెమిలిచేరి యువ‌కుడితో నాలుగేళ్లుగా ప్రేమాయ‌ణం సాగిస్తోంది. వీళ్ల ప్రేమ‌ను ఇరువైపు కుటుంబాలు అంగీక‌రించ‌డంతో …ప్రేమ పెళ్లికి దారి తీసింది.

చెన్నైలోని ఓ క‌ల్యాణ మండ‌పంలో నిన్న పెళ్లి జ‌రిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుక‌లో భాగంగా ముందు రోజు రాత్రి రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. బంధువులు, స్నేహితులు నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

అనంత‌రం వధూవరులు కల్యాణ మండపంలోని వేర్వేరు గదుల్లో బస చేశారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో వధువు తల్లి గదిలోకి వెళ్లి చూడగా కుమార్తె కనిపించలేదు. దీంతో వ‌ధువు త‌ల్లితండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కల్యాణమండపం, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫ‌లితం లేక‌పోయింది. అనంత‌రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో షాకింగ్ విష‌యాలు వెలుగు చూశాయి. వధువు మరో యువకుడిని ప్రేమించిందని, అర్ధరాత్రి అతనితో వెళ్లిపోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో, సదరు వధువు, ఆమె మరో ప్రియుడు గిండీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. వధువు తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంది. ఆ వెళ్లిపోయిన యువ‌కుడు కూడా ప్రేమికుడే అని పోలీసులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇంత‌కూ అత‌నితో ఎన్నేళ్లుగా ప్రేమ కొన‌సాగిస్తుందో తెలియాల్సి ఉంది. కాగా నాలుగేళ్లు ప్రేమించిన యువ‌కుడిని కాకుండా, మ‌రో ప్రేమికుడితో వ‌ధువు వెళ్లిపోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

About The Author