రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది?: హైకోర్టు


మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిగింది. నివాసంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్(ఏజీ) ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న హైకోర్టు ‘‘సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా.. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా?’’ అని ప్రశ్నించింది.
అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్‌ జనరల్‌ పూర్తిస్థాయి విచారణ జరగలేదని వివరించారు. ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని కలెక్టర్‌ నివేదికలో తెలిపారని ఏజీ హైకోర్టుకు వివరించారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.

About The Author