పెళ్లి సంబంధాలు చూస్తున్నారని.. యువతి ఆత్మహత్య


తనకు ఇష్టం లేకున్నా.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని మద్దూర్‌కు చెందిన తెలుగు సునీత (20)కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తనకు ఇప్పుడే ఇష్టం లేకున్నా మరో రెండు రోజుల్లో పెళ్లిచూపులకు వస్తున్నారని తెలిసి మనస్తాపానికి గురైంది.ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఇంట్లోనే పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందింది. ఈ విషయమై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ భాగ్యలక్ష్మారెడ్డి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

About The Author