ఎస్.జానకి (1938 ఏప్రిల్ 23,- 2026 జులై 11)

ఎస్.జానకి (1938 ఏప్రిల్ 23,- 2026 జులై 11) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడింది. వీటిలో మలయాళం, కన్నడ భాషలలో పాడినవే ఎక్కువ. ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొందింది.
జానకి 1938 ఏప్రిల్ గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించింది. జానకి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు. ఉద్యోగ రీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవాడు. చిన్నతనం నుంచి జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన మూడవ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేసింది. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యింది. లతా మంగేష్కర్, పి.సుశీల, జిక్కి, పి.లీల పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడతూ ఉండేది. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి తన 19వ ఏట మామయ్య సలహా మేరకు, చెన్నైలోని ఏవిఎమ్ స్టూడియోలో పాడటం ఆరంభించింది. దాంతో ఆమె మకాం చెన్నైకి మారింది.
తొలినాళ్లలో ఏవీయం స్టూడియో గాయనిగా ఉండి, 1957లో టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలయ్యింది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు వారికి దగ్గరయింది. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఆమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాలగోపాలాన్నీ అలరింపజేసింది. తెలుగులో విజయవంతము అయిన ఎన్నో చిత్రాలకు పాటలు పాడింది. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మున్నగు అనేక భారతీయ భాషలలో పాటలు పాడినది. జానకి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుని, షిర్డీ సాయిబాబా భక్తురాలైన ఆమె చాలా సమయము పూజలలో గడుపుతుంది. అంతేకాక మీరా పై అనేక భక్తిగీతాల క్యాసెట్ల రికార్డు చేసి విడుదల చేసింది. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి, భానుమతి, లీల తర్వాత మూడో మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించింది.
పాటల్లో మిమిక్రి మిక్స్ చేసి సంగీతప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించింది. పదహారేళ్ళ వయసు చిత్రంలోని కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్న పిల్లాడి గొంతు, పెద్ద వాళ్ళ స్వరం, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతులతో పాట మొదలైనవి ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమ తత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికించిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసిందీ అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్నమొన్నటి హీరోయిన్ల వరకూ ఐదు తరాల హీరోయిన్లకి ఆలంబన అయింది. తెరముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టు సరిపోతుంది.
ఆమె 55 ఏళ్ళ సుదీర్ఘకాలం పాటు సుమారు ఐదారు తరాల కథానాయికలకి అన్ని రకాల భావాలనూ స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్యగానం చేసింది. వయసు మీదపడినా ఆ ప్రభావం గొంతుమీద పడనివ్వకపోవడం ఆమె గానశైలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వరసంపదతో జానకి కెరీర్ ఎదురులేకుండా సాగింది. వేలకొద్దీ పాటలు పాడింది జానకి.
హిందీ, సింహళం, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె.జె. జేసుదాస్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయ చంద్రన్, పి.లీలా, కె.ఎస్. చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి. శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి. బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ…
