మూడు వారాల తరువాత కోమా నుంచి బయటపడింది…

మూడు వారాల తరువాత కోమా నుంచి బయటపడింది..
భర్త , అత్తమామల దారుణాన్ని చెప్పింది…

కత్తితో భర్త గొంతులో పొడవడంతో గత నెలలో ఓ 25ఏళ్ల మహిళ కోమాలోకి వెళ్లింది. ఆమె ఇద్దరు పిల్లలకు కూడా అలాగే గొంతు కోసిన గాయాలయ్యాయి. మూడేళ్ల పాప మరణించగా, 18నెలల బాబు చికిత్స పొందుతున్నాడు. అయితే ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ ఘటన జరిగినప్పటి నుంచి కోమాలోకి వెళ్లింది. ఆమె ఆదివారం సాయంత్రం కోమా నుంచి లేచి జరిగిన విషయం చెప్పింది. తన భర్త, అతడి సోదరుడు కలిసి తమ ముగ్గురునీ గొంతు కోసి చంపాలనుకున్నారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ దిల్లీలోని హౌజ్‌ రాణి అనే ప్రాంతంలో నవంబరు 17వ తేదీన ఓ మహిళ, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. మోహిసినా అనే 25ఏళ్ల మహిళ, ఆమె మూడేళ్ల కూతురు, 18 నెలల కొడుకు.. తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. పాప మరణించింది. ఆమె పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు కుటుంబసభ్యులు తమకు మొదట సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
కాగా నిన్న సాయంత్రం మోహిసినా కోమా నుంచి బయటకువచ్చింది. తన వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా పోలీసులకు అందజేసింది. నవంబరు 16వ తేదీ రాత్రి 12 తర్వాత తన భర్త షమీమ్‌ ఇంటికి వచ్చి తనను బాగా కొట్టాడని తెలిపింది. తెల్లవారుజామున నాలుగు వరకు కొడుతూనే ఉన్నాడని చెప్పింది. అత్త, మామ కూడా వచ్చి చూసినా పట్టించుకోలేదని పేర్కొంది. ఉదయం 7 గంటల సమయంలో తన భర్త, అతడి సోదరుడు కలిసి కత్తితో తన కూతురు గొంతు కోయడం చూశానని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తన గొంతు కూడా కోశారని వెల్లడించింది.
ఆమె వాంగ్మూలం మేరకు ఆమె భర్త, అతడి సోదరుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరిగిన రోజు కూడా బాధితురాలి తల్లిదండ్రులు అత్తింటి వారే తమ కూతురిని, పిల్లల్ని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

About The Author