వైకుంఠ ఏకాదశి(6-జనవరి(సోమవారం))


ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమపవిత్రమైన రోజు ఈ ఏకాదశి.  ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యంపై ఒక అవలోకనం…

ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే….

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది.

ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.

ఏకాదశి ప్రాశస్త్యం
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివరణ అనేక పురాణాలలో ఉంది.. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహా విష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసర మని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు.
విశేష ఆరాధన

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.

About The Author