ఇన్నాళ్లు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే అందరికీ హడల్. ఇవి రాజకీయాలను శాసించేవి.. వ్యవస్థను ప్రభావితం చేసేవి.. సీఎంలను కూడా గుప్పిట పట్టేవి. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడవన్నీ కుదలేయ్యాయి. ప్రకటనలు లేక నష్టాల పాలయ్యాయి. కోలుకునే పరిస్థితులు కనుచూపుమేరలో కనిపించడం లేదు. పత్రికల వద్ద ప్రింటింగ్ పేపర్ సామగ్రి నిండుకున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేయకపోతే మొత్తం మూతపడుతుంది. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు లేక అవి జీతాలు కట్ చేసి చాలా మందిని తీసేశాయి.ఇప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో చాలా మంది జర్నలిస్టులను తీసివేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. మరికొందరు ఆ ఊబిలోంచి స్వచ్ఛందంగా బయటకొచ్చేశారు. ఇప్పుడు వారంతా నెక్ట్స్ టార్గెట్ ఏంటి? అని ఆలోచిస్తే డిజిటల్ మీడియా ఒక అవకాశంగా కనిపిస్తోంది. కానీ అది అంత ఈజీ అయిన వ్యవహారం కాదు..
పత్రికలు న్యూస్ చానెల్స్ లో రిపోర్టర్లు పంపించే వార్తలను ఎడిట్ చేసి పెట్టడం ఈజీ. కానీ డిజిటల్ మీడియాలో పాఠకుడిని చివరి దాకా చదివించేలా రాయడం కత్తిమీద సాము. పైగా అసలు విషయాన్ని పత్రికలు చానెల్స్ లో మొదట చెబుతారు. డిజిటల్ మీడియాలో చివరలో చెప్పాలి. చాలా క్రియేటివిటీగా రాస్తే తప్పితే వెబ్ మీడియాలో రాణించడం కష్టం. కొన్నేళ్లుగా చేసిన వారికి మాత్రమే ఇందులో రాణించగలరు. మామూలు జర్నలిస్టులు ఎందరో ఇందులో విఫలమయ్యారు.సగటున 30 మంది జర్నలిస్టులు వెబ్ మీడియాకు ప్రయత్నిస్తే అందులో కేవలం ఒకరో ఇద్దరో మాత్రమే డిజిటల్ మీడియా ప్రాసను అందింపుచ్చుకుంటూ అవకాశాలు దక్కించుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.దీన్ని బట్టి స్కిల్ ఉండి.. అనుభవం ఉన్న జర్నలిస్టులకు మాత్రమే వెబ్ మీడియాలో అవకాశాలుంటాయి. ఆల్ రౌండర్లు అయితే ఇందులో రాణించగలరు. అంతేకానీ.. అక్కడ పోయిందని డిజిటల్ మీడియాలోకి వస్తే మాత్రం ఇక్కడి ఒత్తిడి వార్తలను వేగంగా అందించే తీరు.. క్షణాల్లో స్పందించి స్టోరీగా మలిచే నేర్పు మాములు జర్నలిస్టులకు కష్టమే. అందుకే ఎంతో అనుభవజ్ఞులు మాత్రమే వెబ్ మీడియాలో రాణించగలుగుతున్నారు. ఎంతో మంది జర్నలిస్టులు బయటకు వచ్చినా వారు ఈ డిజిటల్ మీడియాలో రాణించకపోవడానికి అసలు కారణం ఇదే.ఇక పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో తీసేసిన జర్నలిస్టులు ఎవరూ కూడా తిరిగి ఇదే వార్తలు స్టోరీల కంపులోకి జర్నలిజం వృత్తిలో కంటెంట్ రైటర్లుగా కొనసాగాలని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఈ జర్నలిజంకు స్వస్తి పలికి చాలా మంది ఇతర వ్యాపారాలు ఉద్యోగాల్లోకి మరలుతున్నారు. వ్యవసాయం వ్యాపారం.. ఇతర బిజినెస్ లలోకి వెళ్లిపోతున్నారు. జర్నలిజం ఊబిలోంచి బయటపడ్డ వారెవరు తిరిగి దీంట్లోకి రామని ఖరాఖండీగా చెబుతున్నారు. సో డిజిటల్ మీడియా తలుపులు తెరిచినా దీన్ని అందిపుచ్చుకోవడానికి జర్నలిస్టులు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట.. జర్నలిజంలో సంక్షోభాలు.. మీడియా యాజమాన్యాల తీరు చూశాక..చాలా మంది దీన్ని త్యజించి వేరే ఇతర వ్యాపకాల్లోకి మారిపోతున్నారు. కొత్త వాళ్లు తేటతెలుగుపై పట్టులేక ఈ వృత్తిలోకి రావడం లేదు. భవిష్యత్తులో జర్నలిస్టుల కొరత ఈ రంగాన్ని తీవ్రంగా వేధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.

About The Author