రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఈ నెల 29నుఉంచే ప్రారంభం కానున్నాయి. 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములను, 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఫ్లాట్లు, ప్లాట్లు, వాణిజ్యస్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి.. ఆ వెనువెంటనే పంచాయతీ, మునిసిపల్‌ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేయనున్నారు. ఇందుకోసం ధరణి పోర్టల్‌లో అగ్రికల్చర్‌, నాన్‌ అగ్రికల్చర్‌ పేరిట రెండు విభాగాలుగా రూపొందించారు.

వాస్తవానికి దసరా రోజున ధరణి పోర్టల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా… ముహూర్తాలు లేకపోవడం, సాంకేతిక సమస్యలు తీరకపోవడం వంటి కారణాలతో వాయిదా వేశారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నాం 12:30 గంటలకు ధరణి వెబ్‌పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇప్పటిదాకా సబ్‌రిజిస్ట్రార్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేస్తే… మునిసిపల్‌, పంచాయతీ రికార్డుల్లో మ్యుటేషన్‌ను తహసీల్దార్లు చేసేవారు.

తాజాగా రెండు పనులు తహసీల్దార్లే చేసేలా, సేవలందించే అంశంలో జాప్యం నివారించేలా ‘తెలంగాణ భూమి హక్కులు- పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం-2020’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే మ్యుటేషన్‌ జరిగేలా చట్టంలో కీలక మార్పు చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం యథావిధిగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే చేస్తారు. ఇప్పటి వరకు సాగు భూములకే పాస్‌ పుస్తకాలు ఉండగా, ఇక నుంచి వ్యవసాయేతర భూములకూ ఇవ్వననున్నారు.

ప్రత్యేకతలు…

వ్యవసాయ భూములను విక్రయించే రైతులు/కొనుగోలుదారులు పోర్టల్‌లోకి వెళ్లి ‘అగ్రికల్చర్‌’ బటన్‌పై క్లిక్‌ చేసి… స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో రైతులు/కొనుగోలుదారులు సమగ్ర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

ఇక శ్లాట్‌ బుక్‌చేసుకున్న సమయానికి కార్యాలయంలో అడుగుపెడితే సాంకేతిక సమస్యలు, సర్వర్‌ ప్రాబ్లమ్‌ లేకుంటే అరగంటలోనే రిజిస్ట్రేషన్‌/మ్యుటేషన్‌లు జరిగిపోనున్నాయి.

ఆధార్‌కార్డులోని ఫొటోనే పాస్‌పుస్తకం ప్రధాన పేజీలో ముద్రితం కానుంది. లోపాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోర్టల్‌ను తీర్చిదిద్దారు.

ఇక వ్యవసాయేతర ఆస్తుల(ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లు, వాణిజ్య స్థలాలు) రిజిస్ట్రేషన్లు.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ కాగానే మ్యుటేషన్‌ చేసే బాధ్యత కూడా సబ్‌ రిజిస్ట్రార్‌దే. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక మ్యుటేషన్‌ కోసం మునిసిపాలిటీలు/పంచాయతీల్లో దరఖాస్తు చేసుకుంటే… ఆ తర్వాతే రికార్డుల్లో పేర్లు చేరేవి. దీన్ని సవరించి.. కొన్ని మార్పులు చేశారు.

ఆ తర్వాత వ్యవసాయేతర ఆస్తుల యాజమానులకు మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌ జారీ చేయనున్నారు.

స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్‌

కొత్త నిబంధనల ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనైనా, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి. ఇప్పటిదాకా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానం అమలులో ఉన్నా తప్పనిసరి చేయలేదు. ఇకపై స్లాట్‌ బుక్‌ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్లకు అనుమతించరు.

పోర్టల్‌లో ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు వివరాలు పొందుపరిచి, ఈ-చలాన్‌ చెల్లించాకే స్లాట్‌ బుక్‌ అవుతుంది. ఆ మేరకు నిర్ణీత సమయానికి తహసీల్దార్‌/సబ్‌ రిజిస్ట్రార్‌ ముందు ఉండాలి.

About The Author