బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రులు


గద్వాల్ జిల్లా, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, జోగులాంబ అమ్మవారి ఆలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రులు శ్రీ.అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ.సింగిరెడ్ది నిరంజన్ రెడ్డి గారు.
అనంతరం మహబూబ్​నగర్​ హరిత హోటల్​లో జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులతో తుంగభద్ర పుష్కరాల నిర్వహణపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలను కొవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పుష్కరాల కోసం ఐదు చోట్ల ఘాట్లు ఇప్పటికే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
భక్తులు కరోనా వ్యాప్తి చెందకుండా మాస్కులు, శానిటైజర్​లు తప్పకుండా వాడాలన్నారు. శరీర ఉష్ణోగ్రతను కొలిచే యంత్రాలతో పాటు రాపిడ్ యాంటీజెన్ పరీక్షలకోసం శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులంతా కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఈ ఏడాది తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సమావేశంలో దేవాదాయ కమిషనర్ అనిల్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ శ్రుతి ఓజా గారు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author