అనుమానాస్పదస్థితిలో ఇద్దరు ఆత్మహత్య…


నార్సింగి, మునిపల్లి: అనుమానాస్పదస్థితిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం కలకలం రేపింది. నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట మండలం మంచిరేవులలోని వీరభద్రస్వామి ఆలయం వద్ద శనివారం సాయంత్రం ఓ యువకుడు, యువతి వాంతులు చేసుకోవడాన్ని గమనించి 108కు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే వారిని నానల్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు విచారణ జరపగా వారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కవ్వపల్లికి చెందిన సంపత్‌(26), సదాశివపేటకు చెందిన పార్వతి(26)గా గుర్తించారు. ఆస్పత్రిలో చేరిన తరువాత సంపత్‌ తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం తెలిపాడు.
పార్వతికి 8 ఏళ్ల క్రితం పెళ్లయిందని,ఒక బాబు(5) ఉన్నాడని సమాచారం. శనివారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సంపత్‌ ఆదివారం ఉ.10.30గం.లకు, పార్వతి మ.1.30గం.లకు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని ఎస్‌ఐ ఆర్‌.లక్ష్మణ్‌ వివరించారు. ఆత్మహత్యలకు కారణాలు తదుపరి దర్యాప్తులో తెలుస్తాయన్నారు.
పాఠశాల స్థాయి నుంచే ప్రేమ..
సంపత్‌, పార్వతి పాఠశాలలో చదువుకునేటప్పటి నుంచే ప్రేమించుకున్నారు. ఇంటర్‌వరకు చదువుకున్న పార్వతికి ప్రేమించిన యువకుడిని కాదని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినట్లు తెలిసింది. ఆమె కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. ఈ నెల 6న అర్ధరాత్రి పార్వతి ఇంటి నుంచి వెళ్లిపోగా, 7న కుటుంబ సభ్యులు సదాశివపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

About The Author